చైనాలో ఏం జరుగుతోంది - రాత్రంతా ఆందోళనలు: జిన్పింగ్ రాజీనామా కోసం..!!
బీజింగ్: రెండున్నర సంవత్సరాల పాటు ప్రపంచం మొత్తాన్నీ వణికించిన ప్రాణాంతక కరోనా వైరస్కు పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది చైనా. హ్యూబే ప్రావిన్స్లోని వుహాన్ సిటీలో పుట్టుకొచ్చిన ఈ మహమ్మారి బారిన పడని దేశమంటూ లేదు. అన్ని దేశాల్లోనూ అడుగు పెట్టిందీ వైరస్. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను తీసింది. కోవిడ్ బారిన తీవ్రంగా పడిన దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంటోంది. 10 కోట్లకు పైగా పాజిటివ్ కేసులు అక్కడ నమోదయ్యాయి. 11 లక్షల మంది దీని బారిన పడి మరణించారు.
చాపకింద నీరులా..
ఈ జాబితాలో రెండో స్థానంలో భారత్ నిలిచింది. నాలుగున్నర కోట్లకు పైగా పాజిటివ్ కేసులు భారత్లో నమోదయ్యాయి. 5,30,591 మంది మృతిచెందారు. కరోనా వైరస్ను నిర్మూలించడానికి భారత్ సహా కొన్ని దేశాలు వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత దీని తీవ్రత తగ్గింది. పూర్తిగా నిర్మూలించకపోయినప్పటికీ- అన్ని దేశాల్లోనూ ఈ మహమ్మారి విస్తరించే వేగం అదుపులోకి వచ్చింది. మాస్కులను ధరించాల్సిన అవసరం లేనంతగా దీని తీవ్రత తగ్గిపోయింది.
మళ్లీ విజృంభణ..
ఇప్పుడు మళ్లీ చైనాలో కరోనా వైరస్- చాప కింద నీరులా విస్తరిస్తోన్నట్టే కనిపిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు పుట్టుకొస్తోన్నాయి. కోవిడ్ బారిన పడిన వారికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. లోకల్ ట్రాన్స్మీషన్ అధికంగా ఉందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. ఇప్పటికే పలు నగరాల్లో కోవిడ్ ఆంక్షలు పెద్ద ఎత్తున అమలవుతున్నాయి. గ్వాంగ్ఝౌ సిటీలో పాక్షిక లాక్డౌన్ అమలవుతోంది. చొంగ్క్వింగ్ సిటీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
జీరో కోవిడ్ పాలసీ..
రాజధాని బీజింగ్లో కూడా సెమీ లాక్డౌన్ను విధించారు అధికారులు. చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ విధానాన్ని అనుసరిస్తోంది. కట్టుదిట్టంగా దీన్ని అమలు చేస్తోంది. కరోనా వైరస్ను సమూలంగా నిర్మూలించడంలో భాగంగా కఠినమైన ఆంక్షలను విధించింది. పార్కులను క్లోజ్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తిరుగాడే పరిస్థితీ లేదు. కోవిడ్ సోకిన పేషెంట్ నివసించే భవనాలకు సైతం తాళాలు వేస్తోన్నారు. ఎవ్వరినీ బయటికి రానివ్వట్లేదు.
భగ్గమంటోన్న ప్రజలు..
చైనా ప్రభుత్వం అనుసరిస్తోన్న జీరో కోవిడ్ పాలసీ పట్ల ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమౌతోంది. ఇన్ని సంవత్సరాలుగా లాక్డౌన్లో ఉంటూ వచ్చిన చైనీయులు- ఇంకా కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం పట్ల భగ్గు మంటోన్నారు. పెద్ద ఎత్తున నిరసనలను తెలుపుతున్నారు. ఈ క్రమంలో భద్రత సిబ్బందితో ఘర్షణ పడటానికీ వారు వెనుకాడట్లేదు. ఫలితంగా పలు నగరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటోన్నాయి.
షాంఘైలో ఆందోళన..
షాంఘై సిటీలో శనివారం రాత్రి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. జీరో కోవిడ్ పాలసీని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం తక్షణమే దిగిపోవాలంటూ నినదించారు. ప్లకార్లును ప్రదర్శించారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
10 మంది మృతితో..
జిన్జియాంగ్ రీజియన్ రాజధాని ఉరుంక్వీలో ఓ అపార్ట్మెంట్లో సంభవించిన అగ్నిప్రమాదంలో 10 మంది మరణించిన విషయం తెలిసిందే. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా ఈ భవనాన్ని అధికారులు పాక్షికంగా లాక్ చేశారు. ఫలితంగా అగ్నిప్రమాద సమయంలో వారు తప్పించుకోలేకపోయారు. ఈ ఘటన స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైంది. లాక్డౌన్ను నిరసిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. చైనా అధ్యక్షుడు గ్ఝి జిన్పింగ్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
యూనివర్శిటీల్లోనూ..
దాదాపు అన్ని చైనీస్ విశ్వవిద్యాలయాల్లో కూడా నిరసనలు వ్యక్తం అయ్యాయి. శనివారం రాత్రి నుంచి తెల్లవారేంత వరకూ విద్యార్థులు నిరసనల్లో పాల్గొన్నారు. ఉరుంక్వి అపార్ట్మెంట్ అగ్నిప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. ఇందులో భాగంగా కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించారు.