Russia Ukrain Crisis : రష్యాపై అంతర్జాతీయ కోర్టు విచారణ-ఉక్రెయిన్ యుద్ధ నేరాలపై
ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన దండయాత్ర ఇంకా కొనసాగుతోంది. ఉక్రెయిన్ తో నిన్న చర్చల సందర్భంగా కాస్త నెమ్మదించిన రష్యా బలగాలు.. ఇవాళ యథావిధిగా దాడులు చేస్తున్నాయి. అయినా ఉక్రెయిన్ పై పట్టు చిక్కడం లేదు. ఇప్పటికే కీవ్, ఖార్కివ్ సహా పలు కీలక నగరాలు స్వాధీనం చేసుకున్నామని రష్యా ప్రకటనలు చేస్తున్నా వాస్తవ పరిస్ధితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ ఎదురుదాడులే అందుకు కారణం.
ఉక్రెయిన్ పై ఎలాగైనా పట్టు సాధించాలని తపిస్తున్న రష్యా.. క్షేత్రస్దాయిలో దారుణాలకు తెగబడుతోంది. దీంతో ఉక్రెయిన్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన అంతర్జాతీయ న్యాయస్ధానం రష్యా యుద్ధ నేరాలపై విచారణ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే ఈ దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అంతర్జాతీయ కోర్టులోనూ రష్యా దోషిగా తేలితే ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు, చర్యలు తప్పేలా లేవు.
అంతర్జాతీయ కోర్టు ఐసీసీ ప్రాసిక్యూటర్ కరీమ్ ఖాన్ దీనిపై స్పందించారు. ఉక్రెయిన్లో పరిస్థితిపై వీలైనంత వేగంగా దర్యాప్తు ప్రారంభించాలని తాను నిర్ణయించుకున్నానని ఆయన వెల్లడించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ యొక్క రోమ్ శాసనానికి ఉక్రెయిన్ పార్టీ కాదు. కాబట్టి తన దేశంలో వాస్తవ పరిస్దితిని ఉక్రెయిన్ నేరుగా తమకు వివరించలేదన్నారు.
కానీ అది తన భూభాగంలో జరుగుతున్న నేరాలకు సంబంధించి న్యాయస్థానం యొక్క అధికార పరిధిని చట్టబద్ధంగా ఆమోదించడానికి రెండుసార్లు దాని ప్రత్యేకాధికారాలను వినియోగించుకుందని తెలిపారు.తమ ప్రాథమిక పరిశీలనలో ఇప్పటికే అంచనా వేసిన సంఘటనలకు సంబంధించి ఉక్రెయిన్లో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు జరిగాయని తాను నమ్ముతున్నట్లు ప్రాసిక్యూటర్ వెల్లడించారు.