ఇమ్రాన్ ఖాన్కు పాకిస్థాన్ సుప్రీంకోర్టు షాక్: నేషనల్ అసెంబ్లీ పునరుద్ధరణ, ఏప్రిల్ 9న అవిశ్వాస తీర్మానం
ఇస్లామాబాద్: ఇమ్రాన్ ఖాన్కు పాకిస్థాన్ సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడం, జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం వంటి నిర్ణయాలు రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది. పార్లమెంటును పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 9న జాతీయ అసెంబ్లీని నిర్వహించి ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించాలని స్పీకర్ను ఆదేశించింది. ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం ఏకగ్రీవంగా ఈ తీర్పును గురువారం రాత్రి వెలువరించింది.
పాక్ సుప్రీంకోర్టులో ప్రతిపక్షాల వాదనలు
అంతకుముందు, గురువారం మధ్యాహ్నం ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం కేసులో పాక్ సుప్రీంకోర్టులో వాదోపవాదనలు వాడీవేడిగా సాగాయి. ఈ సందర్భంగా విపక్షాలు కోర్టులో తమ వాదనలు వినిపించాయి. 'జాతీయ అసెంబ్లీని చట్టవిరుద్ధంగా రద్దు చేశారు. అవిశ్వాస తీర్మానం ఇప్పటికీ ఉంది. ఉద్దేశపూర్వంగా చేసిన తప్పిదాలను విస్మరిస్తే.. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయ్యే అవకాశం ఉంటుంది. జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని కోరుతున్నాం. దేశానికి సేవ చేసేందుకు ప్రతిపక్షం సిద్ధంగా ఉంది. ఆ తేడా మీకు తెలుస్తుంది' అంటూ విపక్షాలు సుప్రీంకోర్టుకు తెలిపాయి.
ఏప్రిల్ 9న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరపాలని సుప్రీం తీర్పు
అంతేగాక, దేశద్రోహానికి పాల్పడినట్లు ఏవైనా ఆధారాలుంటే.. తాను వెంటనే రాజకీయాలనుంచి తప్పుకుంటానని విపక్ష నేత షాబాజ్ షరీఫ్ వెల్లడించారు. కాగా, అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అక్కడి ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును గురువారం రాత్రి 7.30 గంటలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. తాజాగా జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించి ఏప్రిల్ 9న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరపాలని తీర్పు వెలువరించింది.
ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నాలు వృథా అయినట్లే..
కాగా, ఇమ్రాన్ ఖాన్పై సొంత పార్టీ నేతల తిరుగుబాటుతో మార్చి చివరి వారంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి ప్రతిపక్షాలు. అయితే తీర్మానం తిరస్కరణకు గురైంది. అనంతరం ప్రసంగించిన ఇమ్రాన్.. సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేశ అధ్యక్షుడికి లేఖ రాసినట్లు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలని అన్నారు. ప్రజలంతా ఎన్నికలకు సిద్ధమవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఇమ్రాన్ సిఫార్సు మేరకు.. పాకిస్థాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో.. 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ మంత్రి హబీబ్ ప్రకటించారు. అయితే, ఇమ్రాన్పై పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన రోజు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. 342 మంది సభ్యుల అసెంబ్లీలో తీర్మానం నెగ్గాలంటే 172 మంది ఓట్లు అవసరం. కాగా, తమకు 177 మంది సభ్యుల బలం ఉందని విపక్షాలు ప్రకటించుకున్నాయి. వంద మందికి పైగా విపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానానిపై సంతకం చేశారు. కానీ, పాకిస్థాన్ పార్లమెంట్(నేషనల్ అసెంబ్లీ) డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూర్ విపక్షాల తీర్మానాన్ని తిరస్కరించారు. తీర్మానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. సభను వాయిదా వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో తాజా తీర్పు వెలువడింది. ఒకవేళ సభలో అవిశ్వాస తీర్మానం నెగ్దితే ప్రతిపక్ష నేతలు అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే ఇమ్రాన్ ఖాన్ చేసిన అన్ని ప్రయత్నాలు వృథా అయినట్లే.