ఎన్నికల సంఘాన్ని రద్దుచేయాలి
ఎన్నికల సంఘం నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని.. మంగళవారం విచారణ జరుగుతుందని ఉద్ధవ్ వెల్లడించారు
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తిస్తూ పార్టీ పేరు, ఎన్నికల గుర్తును వారికి కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల్లో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై ఉద్ధవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
శివసేన సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉన్నందున పార్టీ పేరు, గుర్తు కేటాయింపుపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని గతంలోనే తాము అభ్యర్థించామని, అయినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సంఘాన్ని రద్దు చేయాలని వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్లను సైతం ప్రజలే ఎన్నుకోవాలని, తాము అభ్యర్థించినా అంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎన్నికల సంఘానికి అంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

ఎన్నికల సంఘం నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని.. మంగళవారం విచారణ జరుగుతుందని ఉద్ధవ్ వెల్లడించారు. సుప్రీం కోర్టే తమకు చివరి ఆశాకిరణమని, రాజ్యాంగ బద్ధమైన సంస్థల సాయంతో ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతాపార్టీ నాశనం చేస్తోందని విరుచుకుపడ్డారు.
భారతీయ జనతాపార్టీ శివసేనను అంతమొందించాలనే కుట్ర పన్నిందని, అందులో భాగంగా పార్టీ పేరును, గుర్తును లాక్కున్నారన్నారు. తమనుంచి అన్నీ దోచుకున్నారని, కానీ ఠాక్రే అనే పేరును మాత్రం దోచుకోలేరన్నారు. ఈరోజు తమకు జరిగినట్టే రేపు ఇతర పార్టీలకు జరగొచ్చని.. ఇదే పరిస్థితి కొనసాగితే.. 2024 తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం గానీ ఎన్నికలు గానీ ఉండవంటూ కుండబద్ధలు కొట్టారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేన గా గుర్తిస్తూ వారికి పార్టీ పేరు, ఎన్నికల గుర్తును కేటాయించడాన్ని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గం సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
దీన్ని అత్యవసర విచారణ జాబితాలో చేర్చాలని ఠాక్రే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టును అభ్యర్థించారు. కానీ సీజేఐ జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం అందుకు నిరాకరించింది. నిబంధనలు అందరికీ సమానంగా వర్తిస్తాయని, సరైన ప్రక్రియను అనుసరించి మంగళవారం న్యాయస్థానం ముందుకు రావాలని సూచించారు












Click it and Unblock the Notifications