జర భద్రం: మీ మెయిల్స్ను మూడో వ్యక్తి చదువుతున్నాడు
మీ జీమెయిల్ అకౌంట్ సురక్షితంగా ఉందనుకుంటున్నారా...? మీకు వచ్చే మెయిల్స్ మీరు తప్ప ఎవరూ చదవడం లేదనుకుంటున్నారా...? అయితే మీరు పొరబడినట్లే. మీ ఇన్బాక్స్కు వచ్చే మెయిల్స్ను మూడో వ్యక్తి చదువుతున్నాడట.ఇది చదివేందుకు స్వయంగా గూగుల్ సంస్థే అనుమతి ఇచ్చిందట. ఈ మైండ్ బ్లోయింగ్ విషయాలను ప్రముఖ పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
"జీమెయిల్ ఇన్బాక్స్కు వచ్చిన మెయిల్స్ను స్కాన్ చేసేందుకు బయటి నుంచి వందల సంఖ్యలో సాఫ్ట్ వేర్ డెవెలపర్స్కు గూగుల్ అనుమతి ఇచ్చింది. " అని ఆ పత్రికలో వచ్చింది. అయితే దీనిపై గూగుల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్కు 1.4 బిలియన్ వినియోగదారులున్నారు. అయితే ఆ మెయిల్స్ను సమీక్షించేందుకు గూగుల్ కొంతమందిని మాత్రమే ఏర్పాటు చేసింది. గూగుల్ నిబంధనల ప్రకారం ఒకరి సమాచారాన్ని చదివేందుకు గూగుల్కు అనుబంధంగా పనిచేసే సంస్థలకే అప్పగించాల్సి ఉంది. అయితే గూగుల్ సంస్థలు కాకుండా మూడో వ్యక్తికి ఎలా అనుమతించిందో చర్చనీయాంశంగా మారింది. ఇదీ కాకుంటే ఏదైనా విచారణ ఏజెన్సీ కోరిన, ప్రభుత్వ సంస్థలు విచారణ కోసం మెయిల్స్ చెక్ చేయాలని అడిగినా ఒక్క గూగుల్ ఉద్యోగికి మాత్రమే మెయిల్స్ను చెక్ చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం మెయిల్స్ చదివేందుకు గూగుల్ అనుమతిచ్చిన మూడో సంస్థకు చెందిన డేటా కలెక్టర్లు ఓ ప్రత్యేక సాఫ్ట్ వేర్తో మెయిల్స్ను స్కాన్ చేస్తారని పత్రిక వెల్లడించింది. అందులో వినియోగదారుడు సంబంధించి ఏదైనా వస్తువు కొనాలని భావిస్తున్న మెయిల్స్ వచ్చి ఉంటే... మూడో సంస్థకు తెలిసిన మార్కెట్లకు బదలాయిస్తారని పత్రిక వెల్లడించింది. అంతేకాదు మూడో సంస్థకు చెందిన వారికి జీమెయిల్తో పాటు ఇతర వెబ్ మెయిల్స్ కూడా స్కాన్ చేస్తూ ఉంటారు కనుక మీ వ్యక్తిగత సమాచారం బయటకు పొక్కే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక వెల్లడించింది.