మృతిచెందిన తాలిబన్ చీఫ్ మసూద్కి 73కోట్ల ఫాంహౌస్
ఇస్లామాబాద్: అమెరికా డ్రోన్ల దాడిలో మృతి చెందిన పాకిస్తాన్ తాలిబన్ చీఫ్ హకీముల్లా మసూద్కు రూ.73 కోట్ల విలువైన ఫాంహౌస్ ఉన్నట్లుగా గుర్తించారు. పాలరాతి ఫ్లోర్స్, పచ్చని పచ్చిక మైదానం కలిగిన విలాసవంతమై, ఆహ్లాదకరమైన ఫాంహౌస్ మసూద్ కొనుగోలు చేశాడు.
ఉత్తర వజీరిస్థాన్లోని మిరన్ షా ప్రాంత సమీపంలో ఉండే దండే దర్ప్ఖేల్ గ్రామంలో ఈ ఫాం హౌస్ ఉంది. దీనిని మసూద్ ఏడాది క్రితం కొనుగోలు చేశారట. అమెరికా డ్రోన్ల(పైలట్ రహిత విమానం) దాడి నుండి తప్పించుకునేందుకు మసూద్ పాకిస్తాన్లోని గిరిజన ప్రాంతాల్లో తలదాచుకునేవాడట.
దీంతో అతను ఫాం హౌస్లో ఉండలేదు. మసూద్కు ఇద్దరు భార్యలు. వారు ఎనిమిది గదులు కలిగిన ఈ ఫాంహౌస్లో ఉండేవారు. సేపులు, నారింజ, అంగూర తదితరాలను పెంచుతున్నారు. ఇది సింగిల్ స్టోరియడ్ భవంతి. మసూద్ ఇదే ప్రాంతంలో మృతి చెందాడు.
కాగా, అమెరికా డ్రోన్ దాడుల్లో పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ హకీముల్లా మసూద్ హతమైన విషయం తెలిసిందే. హకీముల్లాను పట్టుకోవడానికి సిఐఏ ఆధ్వర్యంలోని నిఘా విమానం ఎప్పటి నుంచో కన్నేసింది. పాకిస్థాన్ తాలిబాన్ నాయకులు శుక్రవారం అత్యంత కీలకమైన సమావేశంలో ఉన్నారు.
ఈ విషయం తెలిసిన అమెరికా దళాలు మిస్సైళ్లతో దాడి చేశాయి. దీంతో ఆ కాంపౌండ్ పూర్తిగా ధ్వంసమైపోయింది. హకీముల్లా సహా ఆరుగురు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. మృతి చెందిన వారిలో మసూద్, ఆయన సమీప బంధువు, అంగరక్షకుడు తారీఖ్, డ్రైవర్ అబ్దుల్లాలు ఉన్నారు.