పాక్ కు అమెరికా బిగ్ షాక్ : ఉగ్రవాద దేశంగా ముద్ర వేస్తూ బిల్లు!
వాషింగ్టన్ : ఉగ్రవాద కార్యకలాపాలకు ఆశ్రయమిస్తూ.. భారత్ ను టార్గెట్ చేసిన పాక్ పై అమెరికాలోను వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. పేరుకే అమెరికాకు మిత్రదేశంగా ఉన్న పాక్.. శత్రు దేశాలకు సహకరిస్తోందంటూ అక్కడి చట్టసభ్యులు నిరసన గళం వినిపిస్తున్నారు.
ఈ మేరకు రిపబ్లిక్ పార్టీకి చెందిన టెడ్ పో, కాంగ్రెస్ కమిటీ సభ్యుడు రోహ్రబచర్.. ఉగ్రవాదానికి మద్దతునిస్తున్న దేశాల జాబితాలో పాక్ ను చేర్చాలని హెచ్ ఆర్ 6069 అనే బిల్లును సభ ముందుకు తెచ్చారు. అమెరికాకు నమ్మకద్రోహం చేసిన పాక్ కు తగిన బుద్ది చెప్పాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని బిల్లును ప్రవేశపెట్టిన సందర్బంలో.. ఉగ్రవాదంపై హౌజ్ కమిటీ సభ్యుడైన టెడ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
పాక్ ఉగ్రవాదానికి కొమ్ముకాస్తుందనడానికి.. బిన్ లాడెన్ లాంటి వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వడమే ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పారు టెడ్ పో. ఉగ్రవాదంపై పాక్ వైఖరిని తెలియజేస్తూ.. పాక్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తోందా.. లేదా అన్నదానిపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 90 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా టెడ్ పో కోరారు.
ఒబామా వివరణ ఇచ్చిన అనంతరం విదేశీ వ్యవహారాల కార్యదర్శి జాన్ కెర్రీ 30 రోజుల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని కోరారు. కాంగ్రెస్ సభ్యుడైన పీట్ ఓల్సన్ భారత్ లో ఉరీ ఉగ్ర ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇంత దారుణానికి ఒడిగడుతోన్న పాక్ చర్యలను అంతర్జాతీయ వేదిక మీద దోషిగా నిలబెట్టేందుకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. జాన్ కార్నిన్ అనే మరో సభ్యుడు కూడా పాక్ ఉగ్ర పోకడలను ఖండిస్తూ ట్వీట్ చేసినట్లుగా సమాచారం.