ప్రతిభ నిరూపించుకో.. గ్రీన్ కార్డు సంపాదించుకో: అమెరికా తాజా పాలసీ
ఇక నుంచి అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలని భావిస్తూ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారు ప్రతిభను మెరుగుపర్చుకుంటూ, రుజువు చేసుకుంటే సరిపోతుంది.
వాషింగ్టన్: ఇక నుంచి అమెరికాలో శాశ్వత నివాసం ఉండాలని భావిస్తూ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారు ప్రతిభను మెరుగుపర్చుకుంటూ, రుజువు చేసుకుంటే సరిపోతుంది. వారికి అమెరికా ప్రభుత్వం గ్రీన్కార్డు జారీ చేస్తుంది. కొత్త వలస విధానంతో తీసుకొచ్చిన 'రైజ్' బిల్లును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదించారు. ఈ బిల్లులోని అంశాలు అమెరికాలో నివాసం ఉంటున్న భారతీయులకు వరంగా మారనున్నాయి. ఈ బిల్లు శాసనంగా మారడంతో ఇప్పటివరకు అమలులో ఉన్న లాటరీ విధానానికి అమెరికా స్వస్తి పలుకుతుంది.
అమెరికా తన దేశంలో శాశ్వత నివాసం కోరుకునే వారికి పాయింట్ల ఆధారంగా కార్డులు జారీ చేస్తుంది. అందుకు వారికి ఆంగ్లంపై గల పట్టు, వారి ఉన్నత విద్య, వారు అందుకుంటున్న అధిక వేతనంతోపాటు వయసు ప్రాతిపదికన పాయింట్లు ఇస్తారు. దీని ప్రకారం భారతీయులు సులభంగా 30 పాయింట్లు సంపాదించే అవకాశం ఉన్నదని ఐటీ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఇది కీలక సంస్కరణ అని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానిస్తే, ప్రతిపక్ష డెమొక్రాట్లు మాత్రం వలస వ్యతిరేక చట్టం అని పెదవి విరిచారు.
గ్రీన్ కార్డుల తగ్గింపే అసలు లక్ష్యం
ఏది ఏమైనా అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్కార్డు) కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భారతీయులకు శుభవార్తే! ఇన్నాళ్లూ గ్రీన్కార్డుల జారీకి అనుసరించిన లాటరీ విధానానికి ట్రంప్ సర్కారు స్వస్తి పలకనున్నది. గ్రీన్కార్డుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ‘రైజ్'(రిఫార్మింగ్ అమెరికన్ ఇమిగ్రేషన్ ఫర్ స్ట్రాంగ్ ఎంప్లాయ్మెంట్) బిల్లును రూపొందించారు. ప్రతిభ ప్రాతిపదికన గ్రీన్కార్డులు జారీ చేయాలని సెనెటర్లు టామ్ కాటన్, డేవిడ్ పెర్డ్యూ రూపొందించిన ఈ బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆమోదం తెలిపారు.
Recommended Video
వలస విధానంలో కీలక సంస్కరణ అన్న అమెరికా అధ్యక్షుడు
‘రైజ్ చట్టం వల్ల అమెరికాలో పేదరికం తగ్గడమేగాక, జీతాలు పెరుగుతాయి. బిలియన్ డాలర్ల పన్నులు ఆదా అవుతాయి' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బిల్లుకు మద్దతుగా వైట్హౌస్లో ఆయన మాట్లాడుతూ గత 50 ఏళ్ల అమెరికా వలస విధాన ప్రక్రియలో ఇది కీలకమైన సంస్కరణగా నిలిచిపోతుందన్నారు. ‘‘గ్రీన్కార్డుల జారీలో తక్కువ నైపుణ్యమున్న వారికి అవకాశం కల్పిస్తున్న ప్రస్తుత విధానానికి రైజ్ చట్టం మంచి ప్రత్యామ్నాయం. అమెరికన్ ఉద్యోగులు చెదిరిపోకుండా ఈ బిల్లు రక్షణ కల్పిస్తుంది. నైపుణ్యం లేని వలస ఉద్యోగులు తగ్గడం ద్వారా అమెరికన్ల వేతనాలు పెరుగుతాయి. ప్రస్తుత వలస విధానం అమెరికన్ ప్రజలు, ఉద్యోగులకు అనుకూలంగా లేదు. కొత్త చట్టంతో 21వ శతాబ్దంలో అమెరికా పోటీతత్వాన్ని, అమెరికాతో దేశ పౌరులకు ఉన్న దృఢమైన బంధాన్ని పునరుద్ధరిస్తుంది. ప్రతీ ఏడాది 10 లక్షల మందికి గ్రీన్కార్డుల్ని జారీచేస్తున్నాం. అమెరికాలోని మోంటానా రాష్ట్ర జనాభాతో అది సమానం. అయితే దురదృష్టవశాత్తూ ఇప్పటిదాకా ఆంగ్లంపై పట్టు, ఉద్యోగ నైపుణ్యం, మంచి వేతనం ప్రాతిపదికగా గ్రీన్కార్డుల కేటాయింపు జరగడం లేదు. ఇకపై అలా ఉండదు'' అని ట్రంప్ పేర్కొన్నారు.
ఇలా ట్రంప్ ఎన్నికల హామీ వాస్తవరూపం
నైపుణ్యం ఉన్న విదేశీ ఉద్యోగులకు ఈ చట్టంతో మేలు కలుగుతుందని ట్రంప్ సీనియర్ సలహాదారు జాసన్ మిల్లర్ పేర్కొన్నారు. వైట్హౌస్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ విధానం ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియాల్లో అమలవుతోందని, పాయింట్ల ఆధారంగా కొత్త విధానం అమలు చేయడం చరిత్రాత్మకమని మిల్లర్ అభిప్రాయపడ్డారు. పాయింట్ల ఆధారంగా గ్రీన్కార్డుల జారీ విధానాన్ని ఈ ఏడాది ఆరంభంలో స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగంలో ట్రంప్ ప్రస్తావించారని చెప్పారు. జీవిత భాగస్వాములు, మైనర్లకు గ్రీన్కార్డుల జారీ తగ్గించాలని కూడా ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. అమెరికన్ ఉద్యోగులను పరిరక్షించేలా ప్రతిభ ఆధారిత వలస చట్టాన్ని అమలు చేస్తామన్న ప్రధాన ఎన్నికల వాగ్దానాన్ని ఈ చట్టంతో ట్రంప్ నెరవేర్చారని మిల్లర్ చెప్పారు.
భారతీయ టెకీలకు లాభమే!
రైజ్ చట్టం వలస ప్రజలకు వ్యతిరేకమని డెమోక్రటిక్ సభ్యులు పేర్కొన్నారు. వలసదారులు ఎప్పటికప్పుడు దేశానికి కొత్త శక్తిని అందిస్తున్నారని.. అమెరికాకు వచ్చే ప్రతి కొత్త తరం ఈ దేశాన్ని మరింత ఉన్నతంగా మారుస్తుందని డెమోక్రటిక్ నేత నాన్సీ పెలోసీ అన్నారు. తొలి నుంచి ట్రంప్ వలస వ్యతిరేక అజెండాను అమలు చేస్తున్నారని.. వలస ప్రజల్లో భయాన్ని నింపడం వల్ల దేశం బలహీన పడుతుందని హెచ్చరించారు. రైజ్ బిల్లు చట్టరూపం దాలిస్తే భారతీయులకు లాభమే. ప్రస్తుతం 3 నుంచి 3.5 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హెచ్-1బీ వీసాపై అమెరికాలో ఉన్నారు. 2016లో మొత్తం 1,26,692 మంది భారతీయులు హెచ్-1బీ పొందడమో, పొడిగించుకోవడమో చేశారని అమెరికా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది అమెరికా జారీ చేసిన హెచ్-1బీ వీసాల్లో భారతీయులకే ఏకంగా 72 శాతం దక్కాయి. వీరిలో అత్యధికులు అమెరికాలో స్థిరపడాలనే కోరుకుంటారు. గ్రీన్కార్డులకు దరఖాస్తు చేస్తే రైజ్ విధానంలో భారతీయులకు పాయింట్లు అధికంగా వచ్చే అవకాశాలుంటాయి.
పరిమితి ఎత్తివేస్తే ఇలా ఇండియన్లకు మేలు
భారతీయుల్లో అత్యధికులు అమెరికా వర్సిటీల్లో మాస్టర్స్ (పీజీ) పూర్తిచేసిన వారే ఉంటారు. విద్యార్హతల పరంగా వీరికి 8 పాయింట్లు లభిస్తాయి. గ్రీన్కార్డుకు దరఖాస్తు చేసుకునే నాటికి మనోళ్ల వయసు 25 ఉంటుంది. 26 నుంచి 30 ఏళ్ల కేటగిరీలో ఉంటారు కాబట్టి.. 10 పాయింట్లు లభిస్తాయి. ఆదాయం పరంగా, ఆంగ్ల భాషలో ప్రావీణ్యంలో కూడా మనోళ్లకు మంచి మార్కులే పడతాయి. కాబట్టి గ్రీన్కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి 30 పాయింట్ల అర్హతను భారతీయుల్లో అత్యధికులు సులభంగా సాధిస్తారు. గ్రీన్కార్డుల్లో ప్రతి దేశానికి ఒక ఏడాదికి ఇంత శాతం మించకూడదనే నిబంధన కారణంగా ప్రస్తుతం గరిష్టంగా 2 శాతం లెక్కన 9,600 డిపెండెంట్ గ్రీన్కార్డులు, గరిష్టంగా 7 శాతం లెక్కన 9,800 ఉద్యోగస్తుల గ్రీన్కార్డులు ఏటా భారత్కు లభిస్తున్నాయి. ఈ కోటాపై పరిమితుల్లో మార్పులు, చేర్పులు చేస్తారా? అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ పరిమితి ఎత్తివేస్తే మాత్రం గ్రీన్కార్డుల్లో భారతీయులు భారీగా లబ్ధి పొందుతారు.
ప్రతిభే గీటు రాయి అయితే నో ప్రాబ్లం
హెచ్-1బీ వీసాల జోలికి ప్రస్తుతం వెళ్లలేదు. అయితే వీటి దుర్వినియోగం జరుగుతోందని ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ, ఎన్నికయ్యాక పలుసార్లు చెప్పారు. ఈ వీసాలకు కనిష్ట వేతనాన్ని 1,30,000 డాలర్లకు పెంచుతూ బిల్లు కూడా పెట్టారు. భవిష్యత్లో హెచ్-1బీ వీసాలకు కూడా ప్రతిభ ఆధారిత విధానాన్ని తెస్తే.. ఉన్నత విద్యార్హతలు, ఆంగ్లంపై పట్టు, మంచి వేతనాలు ఉంటాయి కాబట్టి భారతీయ టెకీలకు నష్టమేమీ ఉండదు. ప్రస్తుతం అమెరికా ఏటా ఇచ్చే 65,000 హెచ్-1బీ వీసాల కోసం కంపెనీలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు దాఖలు చేస్తున్నాయి. తద్వారా లాటరీలో వాటికి వీసాలు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ఈ విధానం దుర్వినియోగం అవుతోందని, బడా కంపెనీలు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసి ఇతరుల అవకాశాలను దెబ్బతీస్తున్నాయని ట్రంప్ వాదన. అందువల్ల హెచ్-1బీ వీసాల మంజూరు విధానంలోనూ మార్పులు రావొచ్చు.