మోడీకి ట్రంప్ ఫోన్, జీ7 ఆహ్వానం: చైనాకు ఎక్కడో కాలింది, గిరి గీయలేరంటూ అక్కసు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోడీని ఈ ఏడాది సెప్టెంబర్లో జరగనున్న అభివృద్ధి చెందిన ఏడు ఆర్థిక వ్యవస్థల కూటమి జీ-7 సదస్సుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, ఈ పరిణామం భారత సరిహద్దులో దుశ్చర్యలకు పాల్పడుతున్న చైనాకు కంటగింపుగా మారింది.
Recommended Video

ప్రధాని మోడీకి ట్రంప్ ఫోన్.. జీ7తోపాటు కీలక చర్చలు
భారత్ తోపాటు జీ-7 సమావేశానికి రష్యా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలను ఆహ్వానిస్తామన్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై చైనా తన అక్కసును వెల్లగక్కింది.
మంగళవారం ప్రధాని మోడీకి ఫోన్ చేసిన ట్రంప్ జీ7 సదస్సుకు ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాగా, ట్రంప్తో ఫోన్ సంభాషణపై ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. తన స్నేహితుడు ట్రంప్తో కీలక అంశాలపై చర్చించినట్లు మోడీ తెలిపారు. జీ-7 సదస్సు, కరోనా మహమ్మారి, ఇతర కీలక అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు. భారత్-చైనా సరిహద్దులో పరిస్థితులు, ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణలు లాంటి అంశాలపైనా వీరు చర్చించారు.

అప్పుడు ఫ్రాన్స్.. ఇప్పుడు అమెరికా..
ఇప్పటి వరకు జీ-7లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా సభ్యదేశాలుగా ఉన్నాయి. ఎవరైతే జీ7 సమావేశాలకు ఆతిథ్యమిస్తారో వారు తమకు సన్నిహిత ఇతర రెండు దేశాలను ఆహ్వానించవచ్చు. గత సమావేశాలు ఫ్రాన్స్ ఆతిథ్యమివ్వగా ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మేక్రాన్ భారత ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఇప్పుడు ట్రంప్ కూడా మోడీని ఈ సదస్సుకు ఆహ్వానించారు.

భారత్ సహా మరో మూడు దేశాలు.. చైనా స్కిప్..
ఈసారి జీ7 సమావేశంలో అమెరికాలో జరగనుంది. కరోనావైరస్ కారణంగా జూన్లో జరగాల్సిన ఈ సదస్సును సెప్టెంబర్కు వాయిదావేశారు. కాగా, జీ-7 కూటమిని విస్తరించాలని ట్రంప్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. భారత్ సహా మరో మూడు దేశాల(రష్యా, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా)ను చేర్చి జీ-10 లేదా జీ-11 దేశాల కూటమిగా తీర్చిదిద్దాలని సూచించారు. అయితే, ఇందులో చైనా పేరును ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. కరోనావైరస్, వాణిజ్య యుద్ధం మొదలైనవి అమెరికా, చైనాల మధ్య దూరం పెంచిన విషయం తెలిసిందే.

గిరి గీయలేరంటూ చైనా అక్కసు
కాగా, జీ7 ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ సంఘాలు, సదస్సులు దేశాల మధ్య సహకారం, సౌభ్రాతృత్వం, బహుళత్వం, ప్రపంచ శాంతి, అభివృద్ధి పెంచేవిగా ఉండాలన్నది చైనా విశ్వాసమని అన్నారు. ప్రపంచంలో చాలా దేశాల పాత్ర అలాగే ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. చైనా చుట్టూ ఓ వృత్తం గీసేందుకు ప్రయత్నాలు విఫలమవుతాయని, ప్రజాదరణ కోల్పోతాయని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications