ఇండియన్ పైలట్ విడుదల: గుడ్ న్యూస్ అందిందని ముందే చెప్పిన ట్రంప్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ రేపు విడుదల చేయనున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ గురువారం చెప్పాడు. అంతకుముందే అభినందన్ను విడుదల చేసేందుకు సిద్ధమని పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషి ప్రకటించారు. ఈ ప్రకటకు ముందే అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ భారత్-కిస్తాన్ ఉద్రిక్తతలపై స్పందించారు.
భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ముగింపు దశకు వచ్చాయని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గురువారం వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో భేటీ ముగిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్, పాకిస్తాన్ పరిస్థితిపై విలేకర్లు ప్రశ్నించారు. భారత్, పాక్కు సంబంధించి ఓ మంచి వార్త తనకు అందిందని, ఇరుదేశాల మధ్య ఏర్పడిన సమస్యలు ముగింపు దశకు చేరుకున్నాయని భావిస్తున్నానని ట్రంప్ వెల్లడించారు. అయితే ట్రంప్ దగ్గరకు వచ్చిన ఆ మంచి వార్త ఏమిటనేది మాత్రం ఆయన బయట పెట్టేందుకు నిరాకరించారు.
ఆ తర్వాత కాసేపటికే ఇమ్రాన్ ఖాన్.. అభినందన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ ఇంకా మాట్లాడుతూ... భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.