ట్రంప్ టారిఫ్ బాంబ్: భారత్-ఇరాన్ వ్యాపారానికి గండం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ వాణిజ్య రంగంలో మరోసారి అలజడి సృష్టించింది. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై 25 శాతం అదనపు సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఆ నిర్ణయం ఇరాన్తో సన్నిహిత వాణిజ్య సంబంధాలు కలిగిన భారత్, చైనా, యూఏఈ, టర్కీ వంటి దేశాలకు పెద్ద తలనొప్పిగా మారింది.
భారత ఎగుమతులపై ముప్పు - రూ. 12,000 కోట్ల బాస్మతీ వ్యాపారం!
ఇరాన్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులలో బాస్మతీ బియ్యం అత్యంత ప్రధానమైనది. ప్రతి ఏటా భారత్ నుండి సుమారు 12 లక్షల టన్నుల బాస్మతీ బియ్యం ఇరాన్కు ఎగుమతి అవుతుంది. దీని విలువ దాదాపు రూ. 12,000 కోట్లు. ప్రధానంగా పంజాబ్, హర్యానా రైతులు ఈ ఎగుమతులపై ఆధారపడి ఉన్నారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో, ఇప్పటికే సుమారు రూ. 2,000 కోట్ల విలువైన షిప్మెంట్లు పోర్టుల్లోనే నిలిచిపోయాయి. బియ్యంతో పాటు టీ, చక్కెర, తాజా పండ్లు, మందులు కూడా భారత్ నుంచి ఇరాన్కు ఎగుమతి అవుతున్నాయి.

భారత్కు దిగుమతులు - ప్రియం కానున్న కివీ, ఆపిల్, ఖర్జూరం
ఇరాన్ నుంచి భారత్ పెద్ద మొత్తంలో డ్రై ఫ్రూట్స్, తాజా పండ్లను దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ ఆపిల్స్, పిస్తా పప్పులు, ఖర్జూరాలు, కివీ పండ్లకు భారత్లో మంచి డిమాండ్ ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఇరాన్ నుంచి సుమారు 311 మిలియన్ డాలర్ల విలువైన పండ్లు, నట్స్ను దిగుమతి చేసుకుంది. అమెరికా ఆంక్షల వల్ల సరఫరాలో అంతరాయం కలిగితే, ఈ వస్తువుల ధరలు సామాన్యులకు భారంగా మారే అవకాశం ఉంది.
భారత్-ఇరాన్ వాణిజ్య చరిత్ర
గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్-ఇరాన్ ద్వైపాక్షిక వాణిజ్యం తగ్గుముఖం పట్టింది:2024-25 ఆర్థిక సంవత్సరం రెండు దేశాల మధ్య మొత్తం వాణిజ్యం 1.68 బిలియన్ డాలర్లు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇది గరిష్టంగా 17.03 బిబియన్ డాలర్లుగా ఉండేది. అమెరికా ఇప్పటికే భారత్పై కొన్ని విభాగాల్లో 50 శాతం టారిఫ్ విధించి ఉంది. ఇప్పుడు అదనంగా 25 శాతం విధిస్తే, అది 75 శాతానికి కి చేరుకునే ప్రమాదం ఉంది, ఇది భారతీయ ఎగుమతిదారులకు శరాఘాతంగా మారుతుంది.
ట్రంప్ ఈ ప్రకటనను అర్ధరాత్రి సామాజిక మాధ్యమం 'ట్రూత్ సోషల్' ద్వారా చేశారు. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారులు ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. త్వరలోనే ప్రభుత్వం దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications