రష్యా కాల్పుల విరమణ ఉల్లంఘన : సుమీలో 500 కేజీల బాంబుతో దాడి.. 18 మంది మృతి..
ఉక్రెయిన్లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఐదు నగరాల్లో కాల్పులు విరమణ ప్రకటించింది. కానీ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తోంది. నివాస గృహాలే లక్ష్యంగా క్షిపణులు, భారీ బాంబులతో రెచ్చిపోతోంది. తాజాగా సుమీ నగరంలో రష్యన్ దళాలు విరుచుకుపడ్డాయి. భారీ బాంబుతో దాడిచేసింది. ఈ దాడిలో 18 మంది పౌరులు మృతిచెందారు. దీనిని ఉక్రెయిన్ సాంస్కృతిక, సమాచార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
నివాస భవనంలో 500 కేజీల బాంబు
మానవత్వాన్ని మంటగలుపుతూ రష్యా సేనలు సుమీలో దాడులకు పాల్పడ్డారని ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నివాస భవనంపై గత రాత్రి సుమారు 500 కేజీల బాంబును విసిరారని దుయ్యబట్టింది. ఈ దాడిని ఇద్దరు చిన్నారులతో సహా 18 మంది పౌరులు మృతిచెందారు . అటు చెర్నివిహ్లోని ఓ భవనంపై కూడా రష్యా దళాలు ఇదే తరహాలో దాడికి దిగాయి. కానీ అదృష్టవశాత్తు ఆ బాంబు పేలలేదు. దీనికి సబంధించిన ఫోటోను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా తన ట్విటర్ లో పోస్ట్ చేశారు.

ఆయుధాలు అందించండి..
రష్యా అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందని కుబేలా మండిపడ్డారు. అమాయక ప్రజలు, చిన్నారుల ప్రాణాలను బలితీసుకుంటుదని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా దురాక్రమణల నుంచి తమ ప్రజలను రక్షించడంలో సహాయపడాలని కోరారు. గగనతలాన్ని మూసివేయాలని ఐరోపా దేశాలను విజ్ఞప్తి చేశారు. రష్యన్ దాడులను సమర్థవంతంగా ప్రతిఘటించేందుకు తమకు యుద్ధ విమానాలను అందించాలని కోరారు.

ఉక్రెయిన్లో 400 మంది మృతి
రష్యా జరుపుతున్న భీకర దాడుల్లో ఇప్పటివరకు ఉక్రెయిన్లో సుమారు 400 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ రక్షణశాఖ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ తెలిపారు. 80 మంది వరకు గాయపడినట్లు అంచనా వేశారు. కానీ పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉందని చెప్పారు. చనిపోయిన 400 మంది 38 మంది చిన్నారులు కూడా ఉన్నారని వెల్లడించారు. 70 మందికి పైగా పిల్లలు గాయపడినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications