యూఎస్ వైమానిక దాడులు: 150 మంది ఉగ్రవాదులు అంతం
ఆఫ్రికా: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్ )ను టార్గెట్ చేసుకుని ఇంతకాలం ఇరాక్, సిరియాల్లో దాడులు చేసిన అమెరికా సైన్యం ఇప్పడుఅల్ ఖైదా ఉగ్రవాదుల అనుబంధ సంస్థల మీద కన్ను వేసింది. ఆఫ్రికా గడ్డ మీద వైమానిక దాడులు చేసింది.
సోమాలియాను వణికిస్తోన్న అల్ షబాబ్ (అల్ ఖైదా అనుబంధ సంస్థ)కు చెందిన 150 మంది ఉగ్రవాదులు ఈ వరుస దాడుల్లో అంతం అయ్యారని అమెరికా రక్షణ శాఖ విభాగం పెంటాగాన్ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. శని, ఆదివారాల్లో ఈ దాడులు చేశామని అమెరికా రక్షణ శాఖ అధికారులు వివరించారు.
సోమాలియా ప్రభుత్వ బలగాలు, ఆఫ్రికన్ యూనియన్ శాంతి పరిరక్షణా బలగాల మీద దాడులు చెయ్యడానికి 200 మంది ఉగ్రవాదులకు అల్ షబాబ్ శిక్షణ ఇస్తున్నదని అమెరికా సైన్యం గుర్తించింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న కేంద్రాల మీద అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది.
ఈ దాడుల్లో ఉగ్రవాదులు మాత్రం చనిపోయారని, సామాన్య పౌరులు ఎవరూ చనిపోలేదని, కనీసం గాయాలు కాలేదని అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న అల్ షబాబ్ సంస్థ విదేశీయులనే టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారని అమెరికా సైన్యం తెలిపింది.