చైనాకు మరోషాకిచ్చిన అమెరికా: 200బిలియన్ డాలర్ల వస్తువులపై సుంకాల పెంపు
వాషింగ్టన్/బీజింగ్: అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం ఈ మధ్య కాలంలో ముగిసేట్లులేదు. తాజాగా, మరోసారి చైనాకు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. మరో 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
చైనా తన వాణిజ్య విధానాలను విధానాలను మార్చుకునేందుకు ఆసక్తికరంగా లేదని, అందుకే మరిన్ని సుంకాలు విధించినట్లు ట్రంప్ చెప్పారు. 200 బిలియన్ డాలర్ల విలువైన చైనా వస్తువులపై 10శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 24 నుంచి ఈ సుంకాలు అమల్లోకి రానున్నాయి.
కాగా, ఈ 10శాతం ఏడాది చివరి వరకు మాత్రేమేనట. ఆ తర్వాత జనవరి 1, 2019 నుంచి ఇదే సుంకాన్ని 25శాతానికి పెంచనున్నట్లు వెల్లడించారు. 'భవిష్యత్లో చైనా మా రైతులు, ఇతర పరిశ్రమలపై ప్రతీకార చర్యలకు దిగితే మేం వెంటనే మూడో దశ సుంకాల అమలు చేపడతాం. మరో 267 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై టారిఫ్లు విధిస్తాం' అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
చైనా, అమెరికా మధ్య గత కొంత కాలంగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. చైనా తన అన్యాయపూర్వకమైన వాణిజ్య విధానాలను మార్చుకోవట్లేదని ఆరోపిస్తూ ఈ జూన్లోనే 50 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై 25శాతం సుంకాలను విధించింది.