రష్యాకు వ్యతిరేకంగా భారత్ను దువ్వుతున్న అమెరికా: పుతిన్తో తెగతెంపులు చేసుకునేలా భారీ ఆఫర్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుంది. ఉక్రెయిన్పై దండెత్తిన రష్యాకు మిత్రదేశాల నుంచి సహకారం అందకుండా చేయడానికి మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా భారత్ను టార్గెట్ చేసింది. మిత్రులను దూరం చేయడం ద్వారా రష్యాపై మరింత ఒత్తిళ్లను తీసుకుని వచ్చేలా వ్యవహరిస్తోంది. దీనిపై ఓ కీలక ప్రకటన వెలువడించింది. భారీ ఆఫర్ను భారత్ ముందు ఉంచింది. అమెరికా ఇచ్చిన ఆఫర్ను భారత్ ఎంతవరకు అంగీకరిస్తుందనేది ఆసక్తికరం.

రష్యా నుంచి దిగుమతులు..
రష్యా నుంచి భారత్ పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. ఇంధనం సహా అనేక రకాల వస్తువులు, నిత్యావసర సరుకులు, పరికరాలు, ఆయుధాలు, ఇతర యుద్ధ సామాగ్రిని భారత్కు దిగుమతి చేయడంలో రష్యా అగ్రస్థానంలో ఉంటోంది. సుదీర్ఘకాలం నుంచి అవన్నీ భారత్కు అందజేస్తోంది. ఈ మధ్యే భారత సైన్యానికి అత్యాధునిక ఏకే 203 రైఫిళ్లను సైతం అందజేయడానికి రష్యా ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 5,000 కోట్ల రూపాయలు పైమాటే.

యుద్ధం తరువాత కూడా..
యుద్ధం తరువాత కూడా భారత్- రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటోంది. పైగా మరింత రాయితీతో పెద్ద ఎత్తున క్రూడాయిల్ను కొనుగోలు చేస్తోంది. ఈ విషయంలో అమెరికా సహా యూరోపియన్ యూనియన్ దేశాలు విధించిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను భారత్ ఏ మాత్రం లెక్కచేయట్లేదు. యుద్ధం విషయంలో తటస్థంగా వ్యవహరిస్తోన్నప్పటికీ- దౌత్యసంబంధాల్లో రష్యాతో తనకు ఉన్న మైత్రీబంధాన్ని కొనసాగింపజేయడానికి, దాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికే మొగ్గు చూపింది.
Recommended Video


దాన్ని దెబ్బకొట్టేలా..
సరిగ్గా- దాన్నే దెబ్బకొట్టేలా అమెరికా తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. రష్యాకు ప్రత్యామ్నాయంగా భారత్కు ఇంధన సరఫరా చేస్తామని ప్రకటించింది. రష్యాతో సమానంగా ఇంధనం, ఇతర వస్తవులు భారత్ దిగుమతి చేసుకునేలా అన్ని రకాలుగా సహకరిస్తామని స్పష్టం చేసింది. రష్యాపై తాము విధించిన ఆంక్షలు, నిషేధాజ్ఞలను భారత్ గౌరవించాల్సి ఉంటుందని పేర్కొంది. రష్యా నుంచి ఎంత పరిమాణంలో ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోందో.. అంతే మొత్తాన్ని తాము అందించగలమని వివరించింది.

అలా అనుకోవట్లేదు..
ఇప్పుడు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్- రష్యా నుంచి తన దిగుమతులను మరింత ముమ్మరం చేస్తుందని తాము అనుకోవట్లేదని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ పిసాకి అన్నారు. రష్యా నుంచి ఒకటి నుంచి రెండు శాతం మేర మాత్రమే భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోందని, దీన్ని మరింత పెంచుకుంటుందని భావించట్లేదని చెప్పారు. ఈ విషయంలో భారత్ నుంచి అంగీకారాన్ని తీసుకోవడానికి తమ దేశ జాతీయ భద్రత ఉప సలహాదారు దలీప్ సింగ్ను భారత పర్యటనకు పంపించామని పిసాకి వివరించారు.

భారత్ అంగీకారంతోనే రాయబారి నియామకం..
భారత్లో తమ దేశ కొత్త రాయబారిని నియమించే విషయంలోనూ అక్కడి ప్రభుత్వ అభిప్రాయాన్ని తీసుకుంటున్నామని పిసాకి చెప్పారు. భారత్ తమకు నమ్మకమైన మిత్రదేశమని, అందుకే ఆ దేశ అంగీకారంతోనే రాయబారిని ఖరారు చేస్తామని అన్నారు. భారత్లో తమ దేశ రాయబారిగా లాస్ ఏంజిలిస్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని నియమించాలని అమెరికా నిర్ణయించింది. ప్రస్తుతం ఇది యూఎస్ సెనెట్లో పెండింగ్లో ఉంది. దలీప్ సింగ్ పర్యటన సందర్భంగా దీనిపై చర్చించామని పిసాకి వివరించారు.












Click it and Unblock the Notifications