సైలెంట్ కిల్లర్-బీపీ లెక్క మారింది : ఇక, 140/90 అయితేనే-డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలు..!!
దేశంలోని 30 శాతం మంది అధిక రక్తపోటు తో బాధ పడుతున్నారు. ఇంపీరియల్ కాలేజీ ఆఫ్ లండన్, భారత్లోని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు సహా వివిధ దేశాల శాస్త్రవేత్తల సహకారంతో సాగిన ఈ అధ్యయనంలో హైబీపీ వల్ల వచ్చే హార్డ్ ఎటాక్, కిడ్నీ, గుండె జబ్బులకు... ఏటా ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మరణాలకు లంకె ఉన్నట్లు తేలింది. బీపీ సమస్యను తగ్గిస్తే 40 శాతం స్ట్రోక్స్, 50 శాతం దాకా హార్ట్ ఫెయిల్యూర్స్ తగ్గుతాయని గతంలోనే కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి. అయితే, తాజాగా సైలెంట్ కిల్లర్గా పేరొందిన అధిక రక్తపోటుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ సవరించింది.

120/80 నుంచి 140/90 కి మార్పు..
ప్రస్తుతం ఉన్న ప్రమాణాల ప్రకారం సిస్టోలిక్ పోటు (హృదయ సంకోచ సమయంలో.. అంటే గుండె కొట్టుకున్నప్పుడు) 120ఎంఎంహెచ్జీ, డయస్టాలిక్ పోటు (హృదయం వ్యాకోచించినప్పుడు) 80 ఎంఎంహెచ్జీలోపు ఉండాలి. సిస్టోలిక్ పోటు 130కి చేరితే.. డయస్టాలిక్పోటు 80 దాటితే జాగ్రత్తపడాలని, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని, ఉప్పు తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా బీపీ ప్రమాణాలకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించింది. సాధారణ ఆరోగ్యవంతులకు సిస్టోలిక్ పోటు 140ఎంఎంహెచ్జీ, అంతకు మించి.. డయస్టాలిక్ పోటును 90ఎంఎంహెచ్జీ, అంతకు మించి వరుసగా 2 రోజులపాటు ఉంటే దాన్ని అధిక రక్తపోటుగా పరిగణించాలని పేర్కొంది.

బీపీ బాధితులకు రిస్కు ఫ్యాక్టర్స్ ఇవే..
రిస్క్ ఫ్యాక్టర్స్.. అంటే పొగ తాగే అలవాటు, మద్యపానం, కష్టపడకుండా ఒకే చోట కూర్చుని పనిచేయడం, రోజుకు అరగంటైనా వ్యాయామం చేయకపోవడం, వంశపారంపర్యంగా బీపీ వచ్చే అవకాశం వంటివి ఉన్నవారికి, హృద్రోగులకు సిస్టోలిక్ పోటు గరిష్ఠంగా 130 దాకా ఉండొచ్చని పేర్కొంది. ఇక, బీపీ రావటానికి ప్రధాన కారణాలను విశ్లేషించారు. గతంలో 50-60 ఏళ్లు దాటిన వాళ్లలోనే హైబీపీ సమస్యలొచ్చేవి. ఇప్పుడు 25-30 ఏళ్లలోని చాలామంది బీపీ సమస్యను ఎదుర్కొంటున్నారు. వయసుతోపాటు ఒత్తిళ్లు, షుగర్, ఎండోక్రైనాలజీ, కిడ్నీల పరిస్థితి తదితరాలను బట్టి వేగంగా మార్పులు సంభవిస్తున్నాయి. ప్రధానంగా ఆహార అలవాట్లు, జీవనశైలి విధానమే వాటన్నింటిపై ప్రభావం చూపుతోంది.

బీపీ నియంత్రణ లేకుంటే అపాయమే..
చేస్తున్న ఉద్యోగాలను బట్టి రాత్రి బాగా పొద్దుపోయాక పడుకోవడం, పగటిపూట ఎప్పుడో నిద్రలేవడం, పొగ తాగడం, మద్యపానం, ఫాస్ట్ఫుడ్, జంక్ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడంతో ఊబకాయులుగా మారి ఎక్కువ మంది బీపీ బారినపడుతున్నారు. మెదడు, గుండె, కిడ్నీలు, లివర్, కళ్లు ఇలా ప్రతి అవయవంపై బీపీ ప్రభావం చూపుతుంది. బీపీ ఎలా వచ్చినా.. వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు తగిన మందులు వాడుతూ, జీవనశైలిలో మార్పుచేర్పులు చేసుకుంటే అధిక రక్తపోటును నియంత్రణలో పెట్టుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 30-79 ఏళ్లవారిలో దాదాపు 128 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని అంచనా. ప్రపంచవ్యాప్తంగా అధిక రక్తపోటు బాధితుల సంఖ్య గత 30 ఏళ్లల్లో రెట్టింపు అయినట్టు అంతర్జాతీయ పరిశోధకుల బృందం అధ్యయనంలో వెల్లడైంది.
Recommended Video

సైలెంట్ కిల్లర్ ను కంట్రోల్ చేయాల్సిందే..
వారిలో అత్యధికులు పేద, మధ్య ఆదాయ దేశాల ప్రజలే. 1990 నాటికి ప్రపంచవ్యాప్తంగా 33.1 కోట్ల మంది మహిళలు, 31.7 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతుండగా.. 2019 నాటికి ఆ సంఖ్యలు మహిళల్లో 62.6 కోట్లకు, పురుషుల్లో 65.2 కోట్లకు పెరిగింది. ఈ అధ్యయన నివేదిక లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైంది. అధిక రక్తపోటు బాధితుల్లో 46% మందికి తమకు ఆ సమస్య ఉన్నట్టు తెలియదు. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అంటారు. 30 ఏళ్లు దాటాక తరచుగా బీపీ చెక్ చేయించుకోవడం మంచిది. 40 దాటినవారు తప్పనిసరిగా తమ రక్తపోటు స్థాయులను పరీక్షించుకుంటూ ఉండాలి. సవరించిన మార్గదర్శకాలు అధికరక్తపోటు ఔషధాల పరిశ్రమపై పెనుప్రభావం చూపుతాయనే అభిప్రాయం వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications