ఇది సర్వోన్నతం: ఇక జీ జిన్పింగ్ లైఫ్టైం చైనా అధ్యక్షుడు
బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఇక జీవితకాలం ఆ పదవిలో కొనసాగేందుకు అధికారికంగా మార్గం సుగమమైంది. ఒక వ్యక్తి అధ్యక్షుడిగా రెండు కంటే ఎక్కువసార్లు పనిచేయకూడదని చైనా రాజ్యాంగంలో ఉన్న పరిమితిని ఎత్తివేసే రాజ్యాంగ సవరణకు ఆ దేశ పార్లమెంట్ (నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్) ఆదివారం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జిన్పింగ్ రెండోసారి అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. ఇకపై కూడా ఆయన ఎన్నాళ్లు కోరుకున్నన్ని రోజులు చనిపోయే వరకు కూడా అధ్యక్షుడిగా ఉండొచ్చు.
ఈ రాజ్యాంగ సవరణకు ఎన్పీసీలో 2,958 మంది సభ్యులు అనుకూలంగా ఓటేయగా, ఇద్దరు మాత్రమే వ్యతిరేకించారు. మరో ముగ్గురు గైర్హాజరయ్యారని చైనా అధికార మీడియా తెలిపింది. చేతులెత్తే ఓటింగ్ విధానాన్ని పక్కనబెట్టేసి, బ్యాలెట్ వ్యవస్థ ద్వారా పోలింగ్ నిర్వహించారు. జిన్పింగ్ తొలుత తన బ్యాలెట్ పత్రాన్ని రెడ్ బాక్స్లో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలంతా రాజ్యాంగానికి విధేయులై ఉండాలన్నారు. అధికార యంత్రాంగం అవినీతికి దూరంగా ఉండాలని హితవు చెప్పారు.

జీ జిన్పింగ్కు సర్వాధికారాలతో ఉమ్మడి నాయకత్వ వ్యవస్థకు చెల్లుచీటి
1954లో అమలులోకి వచ్చిన చైనా రాజ్యాంగానికి 1982 తర్వాత ఇప్పటివరకు నాలుగు సార్లు సవరించారు. తాజా సవరణ ఐదవది. 1949 నుంచి ఏక పార్టీ వ్యవస్థ అమలులో ఉన్న చైనాలో ఒకే వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిలో ఉండరాదన్న నిబంధన తొలిగింపు అతిపెద్ద రాజకీయ మార్పు కానున్నది. అంతకుముందు ఈ ప్రతిపాదనను తొలిగిస్తూ చైనా అధికార సీపీసీ అత్యున్నత సంస్థ ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించించడంతో సీపీసీ ఉమ్మడి నాయకత్వ వ్యవస్థకు చరమగీతం పాడినైట్లెంది. అంతకుముందు మావో జెడుంగ్ తర్వాత మరో నియంత్రుత్వ పాలనకు అవకాశం లేకుండా డెంగ్ జియావో పింగ్.. ఒక వ్యక్తి రెండు దఫాలకు మించి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఎవరూ రెండు కన్నా ఎక్కువసార్లు చేపట్టకూడదన్న నిబంధనను అమలులోకి తెచ్చారు.

తాజా రాజ్యాంగ సవరణతో మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు?
డెంగ్ జీయావో పింగ్ హయాంలో ఒక వ్యక్తి రెండుసార్లకు మించి అధ్యక్ష పదవిలో ఉండరాదని ప్రతిపాదిస్తే.. తాజాగా జిన్ పింగ్ హయాంలో దాన్ని రద్దు చేయాలని ఇటీవల జరిగిన సీపీసీ మహాసభల్లో తీర్మానించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులపై ఉన్న పరిమితిని ఎత్తివేయాలన్న సీపీసీ నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఈ రాజ్యాంగ సవరణ చట్ట విరుద్ధమని పేర్కొన్న సామాజిక కార్యకర్త హు జియాను బీజింగ్ విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. అయితే తాజా రాజ్యాంగ సవరణతో మీడియా, పౌర సమాజం, మత పరమైన అంశాలపై ఆంక్షలు మరింత కఠినతరం అవుతాయని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పొరుగుదేశాలకు ఆందోళనకరం
జీ జిన్పింగ్కు ముందు 1993 నుంచి 2003 వరకు జియాంగ్ జెమిన్, 2003 నుంచి 2013 వరకు హు జింటావో దేశాధ్యక్షులుగా రెండు పర్యాయాలు పని చేశారు. జీ జిన్పింగ్2013లో తొలిసారి దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చైనాలో అత్యంత శక్తిమంతమైన నేతగా ఎదిగారు. చైనా రాజ్యాంగంలో జీ జిన్పింగ్ సిద్ధాంతాలను చేరుస్తూ ఎన్పీసీ మరో రాజ్యాంగ సవరణ చేయనున్నది.
ఇటీవలి దశాబ్దాల్లో చైనాలో అత్యంత శక్తిమంతమైన నాయకుడిగా జిన్పింగ్ ఎదిగారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) వ్యవస్థాపక చైర్మన్ అయిన మావో జెడుంగ్ తర్వాత అధ్యక్ష పదవిలో జీవితకాలం కొనసాగనున్న నేతగా జిన్పింగ్ రికార్డు సృష్టించనున్నారు. కాగా, జిన్పింగ్కు జీవితకాలం అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం కల్పించడం భారత్, జపాన్, ఫిలిప్పీన్స్ తదితర ఇరుగు పొరుగు దేశాలకు ఆందోళన కలిగించే అంశం.

ఘర్షణాత్మక వాతావరణం
2013లో జిన్పింగ్ అధ్యక్షుడయ్యాక ఆయా దేశాలతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. భారత్తో డోక్లాం వివాదం తెలిసిందే. భారత్కు శత్రుదేశమైన పాకిస్తాన్కు చైనా బాగా దగ్గరవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా-పాక్ ఆర్థిక కారిడార్ను కూడా నిర్మిస్తోంది. మాల్దీవులు, శ్రీలంకల్లోనూ తన ప్రాబల్యాన్ని బాగా పెంచుకుంది. రోడ్డు, రైల్వే ప్రాజెక్టులతో నేపాల్తో కూడా సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాలతోనూ విభేదాలను చైనా పెంచుకుంది. ఇవన్నీ జిన్పింగ్ అధ్యక్షుడయ్యాక జరిగినవే. ఈ నేపథ్యంలో జీవితకాలం పదవిలో కొనసాగే అవకాశాన్ని ఆయనకు కల్పించడం పొరుగుదేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

జిన్ పింగ్ వ్యూహం
కఠిన నిర్ణయాలు, క్రమశిక్షణలో అందరి మన్ననలకు పాత్రుడు
చైనాను ఆర్థికంగా, సైనికపరంగా ‘సూపర్పవర్'గా మార్చాలనేదే జిన్పింగ్ లక్ష్యం. మరో 30 ఏళ్లలో చైనాను ప్రపంచ ఆర్థికశక్తిగా, ప్రపంచస్థాయి మిలటరీ శక్తిగా రూపుదిద్దే తన జీవితకాల లక్ష్యాన్ని సాధించేందుకు జిన్పింగ్కు తాజా నిర్ణయం దోహదపడతుందని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక సంస్కరణలను చేపట్టడంతో పాటు పార్టీ కఠినమైన క్రమశిక్షణ పాటించేలా చేయడం, వివిధస్థాయిల్లో అవినీతిని అంతమొందించేందుకు తీసుకున్న ధృడచిత్త వైఖరి ఆయనకు ప్రజాదరణ తెచ్చిపెట్టింది. ఈ విషయంలో పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో ఉన్న వారినీ ఉపేక్షించలేదనే పేరు గడించారు. ఇప్పటికే ఆయన చైనా కమ్యూనిస్టుపార్టీ ప్రధానకార్యదర్శిగా, చైనా పీపుల్స్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా, సెంట్రల్ మిలటరీ కమిషన్ చైర్మన్గా దేశంలోని అన్ని వ్యవస్థలపై కీలకబాధ్యతలు నిర్వహిస్తున్నారు.

1971లో కమ్యూనిస్టు యూత్ లీగ్ లో జీ సభ్యుడు
విప్లవోద్యమ కాలంలో నిర్వహించిన పాత్రతో జిన్పింగ్ తండ్రి చైనా కమ్యూనిస్టు పార్టీలో కీలకబాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయనను తప్పించడంతో జీ జిన్ పింగ్ కుటుంబం కష్టాలు ఎదుర్కొంది. పార్టీలో జిన్పింగ్ నిబద్ధతతో, అత్యంత క్రమశిక్షణతో పనిచేశారు. 1971లోనే కమ్యూనిస్ట్ యూత్లీగ్లో చేరారు. పార్టీలో చేరేందుకు పదిసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమై 1974లో దానిని సాధించీరు. 1999లో ఫుజియన్ ప్రావిన్స్ గవర్నర్ పదవిని చేపట్టారు. 2002లో ఝేజియాంగ్ ప్రావిన్స్, 2007లో షాంఘై పార్టీ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. 2007లోనే పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీలో, సెంట్రల్ సెక్రటేరియట్లో చేరారు. హుజింటావో అధ్యక్షుడిగా ఉన్నపుడు 2008-13 మధ్యలో ఉపాధ్యక్షుడిగా, 2010-12 మధ్యకాలంలో సెంట్రల్ మిలటరీ కమిషన్ వైస్చైర్మన్గా ఉన్నారు. 2012లో తొలిసారిగా ప్రధానకార్యదర్శి పదవిని చేపట్టిన ఆయన 2017లో మళ్లీ ఆ పదవికి ఎన్నికయ్యారు.












Click it and Unblock the Notifications