అలా చేస్తే నీళ్లు ఇవ్వం.. పాక్ కు జై శంకర్ వార్నింగ్..!
పాకిస్థాన్ పై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని కొనసాగించే దేశాలతో తమకు ఎలాంటి సత్సంబంధాలు ఉండవని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి తమ దేశ ప్రజల్ని రక్షించుకునే హక్కు భారత్ కు ఉందని అన్నారు. బంగ్లాదేశ్ పర్యటన జరిగిన కొన్ని రోజుల అనంతరం జై శంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్థాన్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తోందని అన్నారు. పాకిస్థాన్ సరైన సరిహద్దు దేశంగా లేకపోతే పొరుగు దేశం నుంచి ప్రయోజనాలు పొందలేదని స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ను ఉద్దేశించి భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాద కార్యకలాపాల్ని పోత్సహిస్తుంటే భారత్ నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు పాకిస్థాన్ తో సింధు జలాల ఒప్పందం నిలిపివేతను జై శంకర్ సమర్థించారు. పాకిస్థాన్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తుందని అన్నారు. ఉగ్రవాదం నుంచి తమ దేశ ప్రజల్ని రక్షించుకునే హక్కు భారత్ కు ఉందని అన్నారు. ఆ హక్కును ఎలా ఉపయోగించుకోవాలో ఎవరూ నిర్దేశించలేరని జైశంకర్ స్పష్టం చేశారు.
సరిహద్దు దేశాలతో భారత్ ఎప్పుడూ స్నేహపూర్వకంగా ఉంటుందని జై శంకర్ అన్నారు. పెట్టుబడులు, భాగస్వామ్యం, ఎనర్జీ సపోర్ట్, వ్యాక్సిన్ డిప్లొమసీ, ఆర్థిక సాయం ఇలా అనేక విధాలుగా సరిహద్దు దేశాలను భారత్ ఆదుకుంటోందని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ విషయంలో మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధి సరిహద్దు దేశాలకు ఎంతో లాభదాయకం అని తెలిపారు. బంగ్లాదేశ్ లో ఎన్నికల తర్వాత ఇరు దేశాల మధ్య బంధం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూకాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 26 మంది టూరిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రస్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. వందల సంఖ్యలో ఉగ్రమూకలకు హతమార్చింది. అంతేకాక పాకిస్థాన్ పై కఠిన చర్యలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది.

1960లో ప్రపంచబ్యాంకు నేతృత్వంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఈ సింధూ నది జలాల ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు ఆయ్యూబ్ ఖాన్ సంతకం చేశారు. సింధూ నదికి ఉపనదులుగా ఉన్న జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ ఉన్నాయి. అయితే బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారత్ కు నియంత్రణ ఉంటుంది. సింధు, చీనాబ్, జీలం నదులపై పాకిస్థాన్ కు నియంత్ర ఉంటుంది.












Click it and Unblock the Notifications