IPL 2020: సూర్యకుమార్ యాదవ్ పై మౌనం వీడిన గంగూలీ.. ఆ సమయంలోనే..!
న్యూఢిల్లీ: ఐపీఎల్లో గత రెండు, మూడు సీజన్లుగా సత్తా చాటుతున్నా.. ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్కు భారత జట్టులో అవకాశం దక్కడం లేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటన కోసం ఎంపిక చేసిన మూడు జట్లలో కూడా ఈ ముంబై బ్యాట్స్మెన్కు నిరాశే ఎదురైంది. అయినా ఏ మాత్రం సహనం కోల్పోని స్కై(సూర్య కుమార్ యాదవ్).. తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. వినూత్న షాట్లతో భారత 360గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే నిలకడగా రాణిస్తున్న ఈ ముంబై బ్యాట్స్మెన్ను భారత జట్టులోకి ఎందుకు తీసుకోలేదని అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు సెలెక్టర్ల తీరును తప్పుబట్టారు. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పందించాడు.
ఈ సీజన్లో రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ, శుభ్మన్ గిల్, దేవదత్ పడిక్కల్ అద్భుతంగా రాణించారని తెలిపిన దాదా.. వీరందరికంటే సూర్యదే పైచేయి అని ప్రశంసించాడు. అతని టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా అవకాశం లభిస్తుందని హిందూస్తాన్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన సూర్య 41.26 సగటుతో 374 పరగులు చేశాడు. ఈ సీజన్లో ముంబై తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు సూర్య. 2018, 2019 సీజన్లలో కూడా సూర్య 512, 424 మంచి ప్రదర్శన కనబర్చాడు.
ఇక వచ్చే సీజన్కు బీసీసీఐ వేలం నిర్వహిస్తుందా? లేదా అనే సందిగ్ధతపై స్పందించిన దాదా... ఇప్పుడే ఏం చెప్పలేమన్నాడు. ఈ సీజన్ పూర్తి అయిన తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు. అయితే ఈ సీజన్లో దారుణంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. వేలం నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. ఇప్పటికే ధోనీ వేలం గురించి మాట్లాడాడు. బీసీసీఐ తీసుకునే నిర్ణయంపై తమ తదుపరి సీజన్ ప్రణాళికలు ఆధారపడి ఉన్నాయన్నాడు.
ఇక వచ్చే ఐపీఎల్ సీజన్ను భారత్లోనే నిర్వహిస్తామని దాదా తెలిపాడు. అప్పటి వరకు కరోనా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చి, వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నామన్నాడు. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే మాత్రం ఈ సీజన్ మాదిరే దుబాయ్ నిర్వహిస్తామన్నాడు. దుబాయ్ను బ్యాకప్ ఆఫ్షన్గా ఉంచుకుంటామన్నాడు. 'వచ్చే సీజన్ సమయానికి వ్యాక్సిన్ రావడంతో పాటు కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తాయనుకుంటున్నా'అని దాదా తెలిపాడు. 20201 సీజన్లో ఏప్రిల్, మేలో జరిగే అవకాశం ఉంది.