IPL 2021: నరేంద్ర మోడీ స్టేడియంలోకి నో ఎంట్రీ.. కారణం ఇదే..!
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ మ్యాచ్లు జోరుగా సాగుతున్నాయి. అప్పుడే ఎనిమిది మ్యాచ్లు పూర్తయ్యాయి. ఈ మెగా టోర్నమెంట్లో ఆడుతున్న అన్ని జట్లూ రెండేసి చొప్పున మ్యాచ్లను పూర్తి చేసుకున్నాయి. ఈ దశలో విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. పాయింట్ల పట్టికలో టాప్లో ఉంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయాన్ని సాధించింది కోహ్లీసేన. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ టాప్ఫైవ్లో ఉన్నాయి. మన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్క మ్యాచూ గెలవలేదు.
ఆ జట్టు ఖాతాలో ఒక్క పాయింట్ కూడా లేకపోవడం వల్ల పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్లో ఉంది. రెండో విడత మ్యాచ్లు శనివారం నుంచి ఆరంభం కానున్నాయి. ఈ విడతలో సన్రైజర్స్ హైదరాబాద్.. తనకంటే ఎన్నో రెట్లు బలమైన ముంబై ఇండియన్స్ను ఢీ కొట్టబోతోంది. చెన్నై చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమౌతుంది. విజయాల రేషియో.. ముంబై ఇండియన్స్ వైపే మొగ్గు చూపుతోంది.
ఇదిలావుండగా.. ప్రస్తుతం చెన్నై, ముంబైల్లో సాగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ల వేదికలు మారబోతున్నాయి. ఇకపై ఫిరోజ్ షా కోట్లా, ఈడెన్ గార్డెన్స్లకు షిఫ్ట్ కానున్నాయి. అలాగే గుజరాత్ అహ్మదాబాద్లో గల ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియానికి తరలివెళ్లనున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియాన్ని సాధారణ ప్రజల కోసం మూసివేశారు. దాన్ని సీల్ చేశారు. గుజరాత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిని దృష్టిలో ఉంచుకుని గుజరాత్ క్రికెట్ అసోసియేషన్.. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. నరేంద్ర మోడీ స్టేడియంలోకి బయటి వ్యక్తులెవరినీ అనుమతించట్లేదని తెలిపింది.
ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కొనసాగుతున్న సమయంలో 60 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినట్లు జీసీఏ వెల్లడించింది. క్రికెట్ అసోసియేషన్ అధికారులు, సిబ్బంది, టెక్నికల్ గ్రౌండ్ స్టాఫ్, ఫ్రాంఛైజీల ప్రతినిధులకు మాత్రమే నరేంద్ర మోడీ స్టేడియానికి వెళ్లే వీలు కల్పించింది. బీసీసీఐ ప్రకటించిన ఐపీఎల్ 2021 షెడ్యూల్ ప్రకారం.. ఈ స్టేడియంలో తొలి మ్యాచ్ ఈ నెల 26వ తేదీన ప్రారంభమౌతుంది. తొలి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, కోల్కత నైట్ రైడర్స్ తలపడతాయి. ఈ స్టేడియంలోకి ప్రవేశించడానికి మొత్తం నాలుగు గేట్లు ఉండగా.. వాటిలో ఒకటి మాత్రమే తెరిచి ఉంచారు. మిగిలిన మూడింటినీ మూసివేశారు.