తహసీల్దార్ ఆఫీసు ముందు పురుగుల మందు డబ్బాలతో రైతుల హల్ చల్
తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ ఆఫీసుల వద్ద రైతుల హంగామా ఆగటం లేదు. ప్రజలు తహసిల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన ఇంకా మర్చిపోలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిస్థితులలో ఏ మాత్రం మార్పు రావటం లేదు .ఇటీవల కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో వెళ్ళిన ఓ రైతు అక్కడ సిబ్బందిని భయాందోళనకు గురి చేశారు. అక్కడ ఆఫీసు సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు హంగామా సృష్టించిన ఘటన మరచిపోకముందే మరో ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

కొణిజర్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు పురుగుల మందు డబ్బాలతో రైతులు
ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు తుమ్మపల్లికి చెందిన రైతులు తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని హల్ చల్ చేశారు పురుగుల మందు డబ్బాలతో ఆఫీస్ కి వచ్చిన రైతులు ఆఫీస్ గేటికి తాళం వేశారు. కార్యాలయం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది తమకు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారని తుమ్మపల్లి రైతులు ఆరోపించారు. రెవెన్యూ సిబ్బంది తీరుతో విసిగిపోయామని అసహనం వ్యక్తం చేస్తున్న రైతులు ఇవాళ తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.

ఆఫీస్ ముందు ఆందోళన .. పాస్ పుస్తకాల కోసం బెదిరింపు
రెవెన్యూ అధికారులు వెంటనే తమకు పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే పురుగుల మందు తాగి చనిపోతామని పురుగుల మందు డబ్బాలతో ఆఫీసు సిబ్బందిని హెచ్చరించారు. రైతుల తీరుతో తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఏ ఫలితం లేకపోయింది. రైతులు ఆందోళనతో పాటు బెదిరింపులకు పాల్పడటంతో రైతులు పురుగుల మందు డబ్బాలతో రావడంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు.

టెన్షన్ లో తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు ..
ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేయలేమని వారు చెప్తున్నారు. రైతులు ఇలా ప్రతి దానికి ఒత్తిడి పెడితే , బెదిరిస్తే ఎలా పని చెయ్యగలం అని తహసీల్దార్ ఆఫీస్ అధికారులు చెప్తుండటం గమనార్హం . ఇక తెలంగాణా సర్కార్ వీరికి ఒత్తిడి లేకుండా పీఆర్ఓ వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలని భావించినా ఈ తరహా ఘటనలను పీఆర్ఓ లు ఆపగలరా అన్నదే ప్రస్తుతం రెవెన్యూ అధికారులను ఆలోచించేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications