జగన్ ప్రభుత్వానికి మరో వరం ఇచ్చిన కేంద్రం
కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వైఖరికి వెళ్లకుండా జగన్ లౌక్యంగా వ్యవహరిస్తోన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను రాబట్టుకుంటోన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో వరం ఇచ్చింది.
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కేంద్ర ప్రభుత్వం వద్ద తన ఉన్న పట్టును మరోసారి నిరూపించుకున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర ప్రాజెక్టులను మంజూరు చేయించుకుంటోన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తరహాలో కేంద్రంతో ఎలాంటి ఘర్షణ వైఖరికీ వెళ్లట్లేదాయన. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమికి సంపూర్ణ మద్దతు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం లౌక్యంగా వ్యవహరిస్తోన్నారు.

బందరు పోర్ట్ సహా..
గతంలో మచిలీపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేసింది. మొత్తంగా 3,940 కోట్ల రూపాయల మేర రుణాన్ని మంజూరు చేసింది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఈ మొత్తాన్నంతటినీ మచిలీపట్నం పోర్ట్ నిర్మాణానికి వ్యయం చేయాల్సి ఉంటుంది.

జాతీయ రహదారులు..
జాతీయ రహదారుల నిర్మాణానికీ కేంద్ర ప్రభుత్వం ఇదివరకే పచ్చజెండా ఊపింది. ఏపీలో మౌలిక సదుపాయాల విషయంలో ప్రాధాన్యం పెంచిన కేంద్రం.. వరుసగా గ్రీన్ ఫీల్డ్ రహదారుల్ని కేటాయిస్తోంది. ఇదే క్రమంలో బెంగళూరు-కడప-విజయవాడ మధ్య భారీ వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ కంట్రోల్డ్ యాక్సెస్ కారిడార్ ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. దీని వల్ల భారీగా ప్రయాణ సమయంతో పాటు దూరం కూడా తగ్గుతుంది.

తాజాగా కర్నూలులో ఈఎస్ఐ..
తాజాగా రాష్ట్రానికి ఈఎస్ఐ ఆసుపత్రిని మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. న్యాయ రాజధానిగా ఆవిర్భవించే అవకాశం ఉన్న కర్నూలులో దీన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. 30 పడకలతో ఈ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. ఈ మేరకు చండీగఢ్ లో ఏర్పాటైన ఈఎస్ఐ ట్రస్ట్ బోర్డ్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర వేసింది. ఈ సమావేశానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహించారు.

గుణదల ఆసుపత్రినీ..
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ స్కీమ్ కింద విజయవాడ గుణదలలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని కూడా ఈఎస్ఐ పరిధిలోకి తీసుకుని రావడానికి ఈ ట్రస్ట్ బోర్డ్ అంగీకరించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఈఎస్ఐ డిస్పెన్సరీలు అందుబాటులో ఉన్నాయి. కర్నూలు, ఆదోనిల్లో రెండు, నంద్యాల, ఎమ్మిగనూరుల్లో ఒక్కొక్క డిస్పెన్సరీలు ఉన్నాయి. అవన్నీ కూడా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సరైన వైద్య పరికరాలు, మౌలిక వసతులు ఉండట్లేదు.

తిరుపతికి ప్రయాణం..
ఫలితంగా ఈఎస్ఐ కార్డుదారులు అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్య సదుపాయాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు నుంచి తిరుపతి వరకు వెళ్లాల్సి వస్తోంది. తిరుపతిలోని ఈఎస్ఐ రీజినల్ ఆసుపత్రి ఒక్కటే ప్రస్తుతం అందుబాటులో ఉంటోంది. కర్నూలు ఓర్వకల్ లో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లాలో ఈఎస్ఐ కార్డుదారుల సంఖ్య అసాధారణంగా పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని- కర్నూలుకు ఈఎస్ఐ ఆసుపత్రికి కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.












Click it and Unblock the Notifications