కేసీఆర్ చేతిలో బందీగా తెలంగాణ: అమిత్ షా అభినవ పటేల్: రాజగోపాల్ రెడ్డి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చరిత్రలో నిలిచిపోయే రోజు అని కామెంట్స్ చేశారు. తెలంగాణ భవిష్యత్, ప్రజల ఆత్మగౌరవం కోసమే తాను పార్టీ మారానని వివరించారు. సకల జనుల పోరాటం, ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం.. ఒక కుటుంబం చేతిలో బందీగా మారిందని ఫైరయ్యారు.

మోసకారి, దగాకోరు..
కేసీఆర్ ఒక మోసకారి, దగాకోరు అని మండిపడ్డారు. మునుగోడు వేదికగా తాము సమరభేరి మోగించామని చెప్పుకొచ్చారు. తమకు అండగా అమిత్ షా, మోడీ ఉన్నారని గుర్తుచేశారు. అమిత్ షా అభినవ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని పొగిడారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరిగి పరిఢవిల్లాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనని కామెంట్ చేశారు.

బందీగా తెలంగాణ
తన గురించి నీచంగా కామెంట్స్ చేస్తున్నారని గుర్తుచేశారు. అమ్ముడుబోయే వ్యక్తిని కాదని వివరించారు. ఒక కుటుంబం చేతిలో తెలంగాణ రాష్ట్రం బందీగా ఉందని.. అందుకే తాను రాజీనామా చేశానని తెలిపారు. ఆ కుటుంబాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఉప ఎన్నిక వచ్చిందని.. గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ధర్మయుద్దం
టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని.. ధర్మయుద్దం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మీరు ధర్మం వెంట ఉంటారా లేదా సభకు వచ్చిన ఆశేష జనవాహినిని అడిగారు. తాను మాట తప్పనని.. ప్రజలు తలదించుకునే పని చేయనని కుండబద్దలు కొట్టారు.

కేసీఆర్ మెడలు వంచి..
అంతకుముందు బీజేపీ ముఖ్యనేత లక్ష్మణ్ మాట్లాడారు. కేసీఆర్ ప్రజలను ఇబ్బందులకు గురిచేశాడని ఫైరయ్యారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల గోస పడ్డారని వివరించారు. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారని మండిపడ్డారు. తెలంగాణను కల్వకుంట్ల కబందహస్తాల నుంచి కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసమే ఇవాళ అమిత్ షా మునుగోడులో అడుగిడారని చెప్పారు. కేసీఆర్ మెడలు వంచడం ఒక్క అమిత్ షా వల్లే అవుతుందని లక్ష్మణ్ తెలిపారు.












Click it and Unblock the Notifications