ఒక్క హామీ నెరవేర్చలే, ఒట్టి కబుర్లే, బీజేపీపై మంత్రులు హరీశ్, తలసాని ఫైర్
మునుగోడు బై పోల్లో నేతల క్యాంపెయిన్ హీటెక్కింది. జనాలను ఆకట్టుకునేందుకు పాట్లు పడుతున్నారు. మంత్రులు రంగంలోకి దిగారు. ప్రధానంగా బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా ప్రజలను బీజేపీ మోసం చేయాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుందని ఆర్థికమంత్రి హరీశ్ రావు అన్నారు. ఇక్కడ బీజేపీ ఆటలు సాగవని గుర్తుచేశారు.
మద్దతు ధర విషయంలో ఇచ్చిన హామీలు ప్రధాని మోడీ తప్పారని హరీశ్ రావు విమర్శించారు. ఏడాది దాటినా మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించలేదని మండిపడ్డారు. దుబ్బాక, హుజూరాబాద్లో గెలిస్తే రూ. 3 వేలు పెన్షన్ అన్నారని గుర్తుచేశారు. ఒక్క గుజరాత్లో రూ.750 పెన్షన్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల సమయంలో కూడా అనేక హామీలు ఇచ్చి మాట తప్పారని పేర్కొన్నారు. బాధ్యత లేకుండా బీజేపీ నేతలు మాట్లాడుతారని మంత్రి హరీష్ రావు విమర్శించారు.
మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడే వెయ్యి కోట్లు ఇప్పించాలని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. దుబ్బాక, హుజూరాబాద్లో బీజేపీని గెలిపిస్తే రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమకే దత్తత తీసుకునే దమ్ము ఉందని.. అభివృద్ధి చేసే శక్తి ఉందన్నారు. యాదవ సోదరులకు బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ అయిన డబ్బులు వస్తాయన్నారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్కు కోటి రూపాయల నిధులైన తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.