కొత్త పాయింట్: హుజూర్నగర్లో సైదిరెడ్డి విజయంపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ విజయంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. హుజూర్నగర్ ఉపఎన్నికలో సైదిరెడ్డి గెలుపుతో టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ప్రచారం చేయకుండానే సైదిరెడ్డి గెలిచారని.. అందుకే ఈ విజయానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. అయితే, హుజూర్నగర్ ప్రజలపై ఒత్తిడి ఏమైనా ఉందా? అనేది తెలియాల్సి ఉందన్నారు.

ఇక్కడా అంతే..
ఎన్నికల సమయంలో కొడంగల్ పైనా హామీల వర్షం కురిపించారి.. గెలిచిన తర్వాత కొడంగల్కు అభివృద్ధి నిధులు ఎన్ని కేటాయించారో అందరికీ తెలుసని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేపు హుజూర్నగర్ నియోజకవర్గం పరిస్థితి కూడా అంతేనని ధ్వజమెత్తారు.

ఇక్కడే ఎందుకలా?
లోక్సభ ఎన్నికల్లో ఓటమికి విలువ లేదన్న టీఆర్ఎస్ నేతలు.. హుజూర్నగర్ ఉపఎన్నికలో విజయాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారని ప్రశ్నించారు. కాగా, కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అయిన హుజూర్నగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి చేతిలో పద్మావతి పరాజయం పాలైన విషయం తెలిసిందే.

సైదిరెడ్డి భారీ మెజార్టీతో..
పద్మావతిపై టీఆర్ఎస్ అభ్యర్థి 43,358 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సైదిరెడ్డికి 113097 ఓట్లు పోలవగా.. ఉత్తమ్ పద్మావతికి 69,737 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక బీజేపీ అభ్యర్థి కోట రామారావు 2,639, టీడీపీ అభ్యర్థి కిరణ్మయి 1827 ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, స్వతంత్ర అభ్యర్థి సంపత్ (2697)కు ఎక్కువ ఓట్లు వచ్చాయి.

కేసీఆర్ వరాల జల్లు
ఇది ఇలావుంటే, హుజూర్నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డిని గెలిపించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ శనివారం ప్రజాకృతజ్ఞత సభను నిర్వహించారు. ఈ సందర్భంగా హుజూర్నగర్ నియోజకవర్గంపై వరాల వర్షం కురిపించారు. నియోజవకర్గంలోని ప్రతి పంచాయతీకి రూ. 20లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. హూజూర్నగర్ అభివృద్ధి కోసం రూ. 25 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇంకా ఈ నియోజవర్గానికి అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications