పెన్నా తీరంలో జేసీబీతో కోవిడ్ మృతుల అంత్యక్రియలు- ఏపీ సర్కార్ సీరియస్.. సమగ్ర విచారణ..
కరోనా మహమ్మారి విజృంభణ మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. గత నెలలో శ్రీకాకుళం జిల్లా పలాసలో జేసీబీతో కరోనా మృతదేహాన్ని తరలించడం కలకలం రేపిన ఘటన మరువక ముందే తాజాగా నెల్లూరులోని పెన్నా నదీ తీరంలో కరోనా మృతులను జేసీబీలతో ఖననం చేయడం సంచలనంగా మారింది. కరోనా మృతదేహాలను తాకేందుకు అధికారులు సైతం ఇష్టపడకపోవడంతో వాటిని జేసీబీలతో తరలించి ఖననం చేసి చేతులు దులుపుకుంటున్నారని ఈ ఘటనతో స్పష్టమైంది.
అర్ధరాత్రి అంబులెన్స్ లలో కరోనా మృతదేహాలను తీసుకొచ్చి పెన్నా నదీ తీరంలో జేసీబీల్లో విసిరేసి, వాటితోనే ఖననం పూర్తి చేసేశారు.
వైరస్ భయాలతో ఆస్పత్రుల సిబ్బంది మృతదేహాలను ఇలా ఖననం చేశారు. అర్ధరాత్రి గుటుచప్పుడు కాకుండా ఖననం చేయడంపై స్ధానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. మీడియాలోనూ ఈ ఘటనపై కథనాలు రావడంతో ప్రభుత్వం ఇవాళ స్పందించింది.

నెల్లూరులో కరోనా మృతులను జేసీబీతో పెన్నానదీ తీరంలో ఖననం చేశారన్న వార్త తెలియగానే ప్రభుత్వం సీరియస్ అయింది. ఇందులో బాధ్యులను తేల్చేందుకు సమగ్ర విచారణకు అదేశించింది. నెల్లూరు ఆర్డీవో హుస్సేనా సాహెబ్ ను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించింది. ఘటనపై సమగ్రంగా విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ ఇవాళ ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications