శ్రీహరికోట స్పేస్ సెంటర్లో కరోనా కలకలం: కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీకీ పాజిటివ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజువారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటోంది. రోజూ వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 37,379 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. రెండు రోజుల కిందట 22 వేలుగా రికార్డయిన కొత్త కేసులు ఇప్పుడు 40 వేలకు చేరువ కావడం కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతమౌతోంది. దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 1892కు చేరాయి.
ఈ పరిణామాల మధ్య పలు రాష్ట్రాలు ఆంక్షలను విధించుకున్నాయి. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, హర్యానా వంటి రాష్ట్రాలు పాఠశాలలు, విద్యాసంస్థలను మూసివేశాయి. థర్డ్ వేవ్ మొదలైందంటూ నిపుణులు సైతం హెచ్చరికలను జారీ చేస్తోన్నారు. తాజాగా పంజాబ్ నైట్ కర్ఫ్యూను విధించింది. బార్ అండ్ రెస్టారెంట్లు, సినిమా హాళ్ల, షాపింగ్ మాల్స్, మల్టీ ప్లెక్స్, స్పా సెంటర్లన్నీ 50 శాతం సామర్థ్యంతో పని చేయాలని ఆదేశాలను జారీ చేసింది. వాటిల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా వ్యాక్సినేటెడ్ అయి ఉండాలని పేర్కొంది. జిమ్ సెంటర్లను పూర్తిగా మూసివేసింది.
కోవిడ్ బారిన పడుతున్న ప్రముఖుల జాబితా అంతకంతకు పెరుగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్లో వెళ్లారు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండె కూడా కోవిడ్ పాజిటివ్గా తేలారు. ఆయనకు కోవిడ్ సోకినట్లు డాక్టర్లు నిర్దారించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్సభ సభ్యుడు మనోజ్ తివారీకి ఈ మహమ్మారి సోకింది.
ఆదివారం నుంచీ ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నికల ప్రచారానికీ దూరంగా ఉంటోన్నారు. మనోజ్ తివారీకి కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా పాజిటివ్గా తేలింది. ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. ఇక తాజాగా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. ఈ సెంటర్లో పనిచేసే ఉద్యోగులకు వైరస్ సోకింది. ఇప్పటిదాకా 12 మంది ఉద్యోగులు కోవిడ్ బారిన పడ్డారు. వీరిలో ఇద్దరు డాక్టర్లు కూడా ఉన్నారు.
ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ షార్ సెంటర్ అధికారులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తోన్నారు. కిందటి నెల 27వ తేదీన తొలిసారిగా రెండు కోవిడ్ పాజిటివ్ కేసులు ఇక్కడ నమోదయ్యాయి. ఈ నెల 2వ తేదీన మరొకరికి పాజిటివ్గా తేలింది. ఈ పరిణామాలన్నీ థర్డ్వేవ్ ముప్పును సూచిస్తోన్నాయి. ప్రస్తుతానికి ఏపీలో కరోనా వైరస్, ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య పరిమితంగా ఉంటోంది. అవి పెరగబోవనే గ్యారంటీ ఉండట్లేదు.