టీడీపీ సభలో భారీగా తొక్కిసలాట: 8 మంది దుర్మరణం- కన్నీరు పెట్టుకున్న చంద్రబాబు..!!
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. జిల్లాలోని కందుకూరులో ఆయన నిర్వహించిన రోడ్ షోలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడు మంది దుర్మరణం పాలయ్యారు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. వారిని హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

చంద్రబాబు దిగ్భ్రాంతి..
ఈ ఘటన పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని చంద్రబాబు ప్రకటించారు.

తొక్కిసలాటతో..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు.. ఇదేం ఖర్మ రాష్ట్రానికి పేరుతో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో భాగంగా ఆయన ఇదివరకు కర్నూలు, పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు. ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ ఆందోళనను కొనసాగిస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చేరుకున్నారాయన.

నెల్లూరులో..
ఈ ఆందోళనలో భాగంగా చంద్రబాబు ఇవ్వాళ నెల్లూరు జిల్లాకు వచ్చారు. కందుకూరు పట్టణంలో భారీ రోడ్ షోను నిర్వహించారు. రోడ్ షోలో చంద్రబాబు వాహనంపై నుంచి ప్రసంగిస్తోన్న సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఇరుకైన ప్రదేశం కావడం, పక్కనే మురుగునీటి పారుదల కాలువ ఉండటం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
డ్రైనేజీలో..
తొక్కిసలాట చోటు చేసుకోవడంతో కార్యకర్తలు పక్కనే ఉన్న కాలువలో పడిపోయారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో 10 మంది వరకు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వారిని హుటాహుటిన అక్కడి నుంచి కందుకూరు జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో అయిదుమంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య ఏడుకు పెరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది.

చంద్రబాబు ఆవేదన..
ఈ ఘటన పట్ల చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్లి, బాధితులను పరామర్శించారు. కార్యకర్తల యోగ క్షేమాలను తాను ఎప్పుడూ కోరుకుంటానని పేర్కొన్నారు. అయిదుమంది మరణించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మరో ఆరుమంది తీవ్రంగా గాయపడ్డారని, వారు కోలుకోవాలని అన్నారు. త్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

నారా లోకేష్ దిగ్భ్రాంతి..
కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో చోటు చేసుకున్న ఘటన పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచి వేసిందని అన్నారు. తమ కుటుంబ సభ్యులైన పార్టీ కార్యకర్తల మృతి తీరని లోటుగా పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు.












Click it and Unblock the Notifications