Pakistan Playing XI vs India: రేపే మ్యాచ్: కొండలాంటి కోహ్లీసేనను ఢీ కొట్టే పాక్ తుది జట్టు ఇదే
అబుధాబి: క్రికెట్ ప్రపంచంలో చిరకాల ప్రత్యర్థులుగా గుర్తింపు పొందిన భారత్-పాకిస్తాన్ జట్లు మరోసారి ఎదురెదురు పడ్డాయి. టీ20 ప్రపంచకప్ మెగా టోర్నమెంట్లో తలపడనున్నాయి. సూపర్ 12లో భాగంగా ఆదివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. భారత జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యాన్ని వహిస్తున్నాడు. డాషింగ్ ఓపెనర్ బాబర్ ఆజమ్ కేప్టెన్సీలో పాకిస్తాన్ ఆడబోతోంది.
India vs Pakistan T20 World Cup 2021: మ్యాచ్ మాత్రమే కాదు..అంతకుమించి: హోమాలు మొదలయ్యాయ్
రెండు దేశాల్లో ఫీవర్..
రెండు దేశాల్లోను పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారిన మ్యాచ్ ఇది. కోట్లాదిమంది ప్రజలు ఈ మ్యాచ్ పట్ల అత్యంత ఆసక్తిగా, అంతకుమించి ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. తమ దేశం గెలవాలని కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్ తాలూకు ఫీవర్ మొదలైంది. ప్రత్యేక పూజలు మొదలు పెట్టేశారు. హోమాలను నిర్వహిస్తున్నారు. బెంగళూరు సుధామనగర్, శ్రీనివాస కాలనీలోని శ్రీ విశ్వప్రియ చంద్రమౌళీశ్వర్ స్వామివారి దేవస్థానంలో ఈ ఉదయం టీమిండియా అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు. హోమాన్ని నిర్వహించారు. జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కేప్టెన్ రోహిత్ శర్మ చిత్రపటాలు, వరల్డ్ కప్, జాతీయ పతాకాన్ని ఉంచి పూజలు చేశారు.
పాక్పైనే ఒత్తిడి..
అటు ప్రపంచకప్లో, ఇటు టీ20 వరల్డ్కప్లో టీమిండియాను ఓడించిన చరిత్ర పాకిస్తాన్కు ఇప్పటిదాకా లేదు. ఈ రెండు మెగా టోర్నమెంట్లల్లో ఎదురుపడిన ప్రతీసారీ భారత జట్టు చేతిలో పాకిస్తాన్ చావుదెబ్బలు తిన్నది. టీ20 ప్రపంచకప్లో మొత్తంగా అయిదుసార్లు ఈ రెండు జట్లు హోరాహోరీగా పోరాడాయి. నాలుగింట్లో భారత్ విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ టైగా ముగిసింది. ఇప్పటిదాకా ఎప్పుడూ గెలవకపోవడం వల్ల పాకిస్తాన్ తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. గెలిచి తీరాల్సి ఉంటుందనే ఒత్తిడికి గురవుతోంది. ప్రపంచకప్లో, ఇటు టీ20 వరల్డ్కప్లను రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా 12 మ్యాచుల్లో పాక్ ఓడిపోయింది.
బాబర్ ఆజమ్ ఏం చెబుతున్నాడు..?
పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ మాత్రం.. విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. కేప్టెన్గా తొలిసారిగా భారత జట్టును ఢీ కొట్టబోతున్నప్పటికీ.. తనపై ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేస్తోన్నాడు. ఇదివరకు ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్తో జరిగిన మ్యాచుల్లో తాను ఆడానని, అందుకే తాను ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకావట్లేదని అన్నాడు. ఇప్పటికే టీమిండియాను ఎదుర్కొన్న అనుభవం తనకు ఉందని పేర్కొన్నాడు.
వెనుదిరిగి చూసుకోదలచుకోలేదు..
ఐసీసీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లల్లో భారత్పై ఏనాడూ గెలిచిన సందర్భం లేకపోవడాన్ని తాను పెద్దగా పట్టించుకోవట్లేదని బాబర్ ఆజమ్ స్పష్టం చేశాడు. వెనుదిరిగి చూసుకోవట్లేదని వ్యాఖ్యానించాడు. సానుకూల దృక్పథంతో మ్యాచ్ ఆడతామని చెప్పాడు. కోహ్లీసేనను ఓడించడానికి తమవద్ద కొన్ని వ్యూహాలు ఉన్నాయని, వాటిని పక్కాగా ఎగ్జిక్యూట్ చేస్తామని స్పష్టం చేశాడు. బ్యాటింగ్ విభాగమే తమ ప్రధాన బలమని, భారీ స్కోరును సాధిస్తామని అన్నాడు. అలాగే బౌలర్లందరూ ఫామ్లో ఉన్నారని, భారత్ను కట్టడి చేస్తామని చెప్పాడు.
భారత్ను ఢీ కొనే తుది జట్టు ఇదే..
ఆదివారం నాటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియాను ఢీ కొనే తుదిజట్టును బాబర్ ఆజమ్ ప్రకటించాడు. బాబర్ ఆజమ్ (కేప్టెన్), మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఇమద్ వసం, షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ, హ్యారిస్ రవూఫ్కు తుదిజట్టులో చోటు దక్కింది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఓపెనర్లుగా ఉంటారు. వారిద్దరూ ఓపెనర్లుగా భారీ భాగస్వామ్యాన్ని నిర్మించారు.
ఊపుమీద ఉన్న ఓపెనర్లు..
వీరిద్దరూ ఈ మధ్యకాలంలో మంచి ఫామ్లో ఉన్నారు. ఈ ఏడాది బాబర్ ఆజమ్ ఇప్పటిదాకా 17 టీ20 మ్యాచ్లను ఆడాడు. 523 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 122 పరుగులు. రిజ్వాన్.. ఏడు మ్యాచులను ఆడాడు. ఒక సెంచరీ.. ఒక హాఫ్ సెంచరీ చేశాడు. అత్యధిక స్కోరు 115 పరుగులు నాటౌట్.