జనసేనపై కుట్రలు మానుకోండి: రాపాక విషయంపై పవన్ కళ్యాణ్ హెచ్చరిక
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ మద్దతుదారులు జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. తమ పార్టీపై కుట్రలు మానుకోవాలన్నారు.

ఎవరు చేయించారో తెలుస్తోంది..
‘నిన్న మేము రైతుల కోసం రైతు సౌభాగ్య దీక్ష'లో ఉంటే.. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్కు పార్టీ షోకాజు నోటీసు జారీ చేశామని.. ముందుగా వైసీపీ సంబంధిత వెబ్సైట్లో రావడం చూస్తుంటే.. మనకి ఎవరు చేయించారో అర్థమవుతుంది. దీనికి నియోజకవర్గ ప్రజలు కూడా ఖండించండి' అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.

నేను రంగంలోకి దిగితేనే..
‘అలాగే రాపాకను అరెస్ట్ చేసి బెయిల్ రానివ్వకుండా వైసీపీ నాయకులూ ప్రయత్నించినప్పుడు.. స్వయంగా రంగంలో నేనే దిగడానికి వచ్చినప్పుడు వారు వెనక్కి తగ్గారన్న సంగతి నియోజకవర్గ ప్రజలు అందరు జ్ఞాపకం చేసుకోవాలి' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

క్షమాపణలు చెప్పాలి..
అంతేగాక, తప్పుడు వార్తలు ప్రచురించినందుకు వైసీపీ మద్దతుదారులు రాపాకకు క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. కాగా, గురువారం రైతుల కోసం దీక్ష చేసిన సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. మానవత్వం నా మతం... ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం నా కులం అని చెప్పుకొన్న జగన్ రెడ్డి.. కౌలు రైతులను కులాల వారిగా ఎందుకు విడగొట్టారని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

వందల కోట్లు ఎగ్గొట్టేవాళ్లు చట్ట సభలో కూర్చుంటున్నారు
‘రైతులకు రుణాలు ఇవ్వాలంటే బ్యాంకులు చాలా ఇబ్బందులు పెడతాయి. కానీ ఎంతో మంది ప్రజాప్రతినిధులు బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టి చట్టసభల్లో దర్జాగా కూర్చున్నారు. రుణాలు కట్టకపోతే రైతులను పీక్కుతింటారు. వాళ్లను మాత్రం అడిగే దిక్కు లేదు. అందుకే రైతులకు కడుపు మండుతుంది. సూట్ కేసు కంపెనీలు పెట్టి మీరు ముఖ్యమంత్రి అయితే .. కష్టపడే రైతుకు కడుపు మండదా..? బ్యాంకింగ్ వ్యవస్థ కూడా పెద్ద మనసుతో ఆలోచించి రైతులకు అండగా ఉండాలి. అలాగే రైతుల ప్రతినిధిగా మాట్లాడాలంటే తగ్గే మాట్లాడాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

రైతులకు జనసేన అండగా యాత్రలు
రైతుల సమస్యలు తీరాలంటే ప్రభుత్వాల వద్ద తగ్గే మాట్లాడాలి. మర్యాదగా అడుగుతున్నాం... 75 కేజీల ధాన్యం బస్తాకు రూ. 1300 కాదు రూ. 1500 ఇవ్వండి. మీరు చేసిన ఆలస్యానికి క్షమాపణ చెప్పినట్లు ఉంటుంది. 2050 నాటికి ఆహార అవసరాలు సరిపోవు. తాగునీటికి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. అందుకే దూరదృష్టితో ఆలోచించే జనసేన మ్యానిఫెస్టులో లక్షమంది యువరైతులను తయారు చేస్తానని అన్నాను. ప్రతినెల రైతుకు రూ. 5 వేలు పింఛన్ ఇస్తానన్నది వాళ్లను దళారుల నుంచి రక్షించడానికే. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొనే ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలన్న దిశగా అడుగులు వేస్తున్నాం. రైతులకు అండగా జనసేన పార్టీ నిలబడుతుంది. ఏపీలోని రైతులందరూ సంఘటితంగా నిలబడితే సమస్యలు ఎందుకు పరిష్కారం కావో నేను చూస్తాను. వ్యవసాయ శాస్త్రవేత్తలు, బ్యాంకు అధికారులతో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరించేలా చూస్తాను. అలాగే జనవరి నెల నుంచి రైతు సమస్య పరిష్కారం కోసం యాత్రలు చేపడతాను' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.












Click it and Unblock the Notifications