నేరేడ్మెట్లో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య: కొత్త కోణం, రేప్ చేశారని పేరంట్స్ అనుమానం
హైదరాబాద్: నగరంలోని నేరేడ్మెట్కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆర్కే పురం చెరువులోకి దూకి ఆత్మహత్యకు చేసుకున్న ఘటన శుక్రవారం రాత్రి సంచలనం సృష్టించింది. ఇద్దరూ ఒకే చెరువులో దూకి అత్మహత్య చేసుకోవడంతో ఇద్దరూ చెరువు వద్దకు కలిసే వచ్చారా లేదా వేర్వుగా వచ్చా? అనేది తెలియాల్సి ఉంది.
గురువారం రాత్ర ఇంటి నుంటి బయటకు వెళ్లిన వీరిద్దరూ చెరువులో విగతజీవులుగా మారి కనిపించారు. మృతులను మౌనిక(20), సౌమ్య రాజేశ్వరి(16)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే... మౌలాలి తిరుమలనగర్కు చెందిన చిరంజీవి, పద్మావతి దంపతుల కుమార్తె మౌనిక ఘట్కేసర్లోని అరోరా ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండికి చెందిన బ్రహ్మానందశర్మ, వల్లికాదేవిల కూతురు సౌమ్య రాజేశ్వరి దిల్సుఖ్నగర్ కొత్తపేట చైతన్య కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పద్మావతి, వల్లికాదేవిలు అక్కాచెల్లెళ్లు. ఈ క్రమంలో సౌమ్య రాజేశ్వరి తల్లిదండ్రులు గతంలోనే చనిపోవడంతో జీడిమెట్లలో ఉంటున్న పెదనాన్న చిరంజీవి నగరానికి తీసుకొచ్చి చైతన్య కాలేజీలో చేర్పించారు.
ఆరోగ్యం బాగా లేకపోవడంతో సౌమ్య రాజేశ్వరి రెండు రోజుల క్రితం మౌలాలిలోని మౌనిక ఇంటికి వెళ్లింది. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో ఇద్దరు కలిసి నాచారం హెచ్ఎంటీ నగర్లోని బంధువుల ఇంటికని వెళ్లారు. ఆ తర్వాత శనివారం ఉదయం నేరెడ్మెట్కు సమీపంలోని ఆర్కేపురం చెరువులో మృతదేహాలై కనిపించారు.
స్థానికుల సమాచారం మేరకు నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ కిషన్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో తమ చావుకు వేధింపులే కారణమంటూ వేర్వేరుగా రాసిన సూసైడ్ నోట్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టు 3వ తేదీ తారీఖుతో మౌనిక రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్ నోట్లో కామేష్ అనే వ్యక్తి తనను బ్లాక్మెయిల్ చేస్తూ వేధింపులకు గురి చేశాడని, శాడిస్ట్గా మారి తన జీవితాన్ని నాశనం చేశాడని పేర్కొంది. తాను ప్రేమించిన నాగర్జున అలియాస్ నానిని కామేశ్ తనకు దక్కకుండా చేశాడని మౌనిక ఆరోపించింది.
కామేశ్ తన జీవితంలోకి ప్రవేశించి ప్రేమికుడికి దక్కకుండా చేశాడని, కొద్ది రోజుల్లో నాగార్జున మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని, తన ప్రియుడు లేని జీవితాన్ని ఊహించుకోలేక తాను కూడా చనిపోతున్నానని, తన చావుకు ప్రధాన కారణం కామేశేనని సూసైడ్ లేఖలో పేర్కొంది.
మరోవైపు సౌమ్య రాజేశ్వరి తన సూసైడ్ నోట్లో కుటుంబ సమస్యల గురించి లేఖలో పేర్కొంది. తనకు అమ్మానాన్నలు లేరని, పదో తరగతి పూర్తయ్యాక తనను హాస్టల్లో జాయిన్ చేశారని, తాను అక్కడ ఉండేందుకు ఇష్టపడ్డా తనను అత్త ఆకివీడు తీసుకెళ్లిందని చెప్పింది. అక్కడ వెళ్లాక అత్త, ఆమె చెల్లెలు తనను బాధ పెట్టారని, అన్నయ్యను తన నుంచి దూరం చేశారని రాసింది.
ఆ తర్వాత హైదరాబాద్కు తీసుకొచ్చి కాలేజీలో చేర్పించారని చెప్పింది. ఈ వేధింపులు ఇక భరించలేక తాను చనిపోతున్నట్టు సౌమ్య రాజేశ్వరి పేర్కొంది. ఈ జంట ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆమె ప్రియుడిగా తెరపైకి వచ్చిన నాగార్జున అనే యువకుడు నేరెడ్ మెట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.
అనంతరం మీడియాతో మాట్లాడిన నాగార్జున అలియాస్ నాని పలు కీలక విషయాలను బయటపెట్టాడు. మౌనికకు, తనకు మధ్య ప్రేమాయణం కొనసాగిన మాట వాస్తవమేనని నాగార్జున ఒప్పుకున్నాడు. అయితే కాలక్రమంలో తన నుంచి దూరంగా జరిగిన మౌనిక... కామేశ్ అనే యువకుడికి దగ్గరైందన్నాడు.
ఆ తర్వాత తాను మౌనిక గురించి ఆలోచించడమే మానేశానన్నారు. మౌనిక ఆత్మహత్యలో తన ప్రమేయం ఏమీ లేదని అతడు చెప్పాడు. ఇదిలా ఉంటే... తన మృతికి ప్రధాన కారకుడిగా మౌనిక ఆరోపించిన కామేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రేమాన్మాది కామేష్ వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మౌనిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కామేష్ వేధింపులే తమ కుమార్తెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా కూతుళ్లపై దారుణానికి కూడా పాల్పడి ఉండొచ్చని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.