కలకలం: కోతుల గుంపు దాడిలో వృద్ధురాలు మృతి
నల్గొండ: సూర్యపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా కోతుల మంద దాడి చేయడంతో ఓ వృద్ధురాలు తీవ్ర గాయాలపాలై ప్రాణం కోల్పోయింది. ఆత్మకూర్(ఎస్) మండలం పాత సూర్యాపేటలో చోటు చేసుకుంది. వృద్ధురాలి మరణం స్థానికంగా కలకలంగా మారింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పాత సూర్యపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. ఎవరూ లేకపోవడంతో ఆమె ఉన్న ఇంటిలోకి కోతుల మంద ప్రవేశించింది. మంచంలో ఉన్న వృద్ధురాలుపై ఒక్కసారిగా కోతుల గుంపు దాడి చేసింది.
కోతుల దాడిలో ఆ వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. ఎవరూ చూడకపోవడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయింది. కోతుల గుంపు దాడి చేయడంతో వ్యక్తి ప్రాణం పోయిందన్న వార్త.. స్థానికంగా భయాందోళనలకు గురిచేసింది. ఊర్లో కోతుల బెడద ఎక్కువైందని... కోతులను గ్రామంలోకి రాకుండా చేయాలని అధికారులను వేడుకుంటున్నారు గ్రామస్తులు.
కోతుల గుంపు ఇళ్లల్లోకి చొరబడి వస్తువులు కూడా ఎత్తుకెళుతున్నాయని చెబుతున్నారు. ఒకవేళ కోతులను బెదిరిస్తే.. అవి దాడులకు తెగబడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోతుల మంద దాడిలో వ్యక్తి ప్రాణం పోవడంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. కోతులను గ్రామం నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.