ఏసీబీ దూకుడు: ఈ కార్ రేసు కేసులో ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీకి నోటీసులు
హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు వ్యవహారంలో ఏసీబీ విచారణ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రేస్ నిర్వహణలో తొలి ప్రమోటర్గా ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీకి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ రేసును నిర్వహించేందుకు ఒప్పందం చేసుకుని ఉన్నట్టుండి ఏస్ నెక్ట్స్ అనే కంపెనీ ఆ ఒప్పందం నుంచి అప్పట్లోనే వైదొలగింది.
ఈ నేపథ్యంలో జనవరి 18న ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఏసీబీ స్పష్టం చేసింది. కాగా, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ ఇంజినీర్ ఇన్ చీఫ్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు.

2022 అక్టోబరు 25న జరిగిన తొలి ఒప్పందం ప్రకారం సీజన్ 9 తోపాటు 10, 11, 12 రేస్ల నిర్వహణ ఖర్చులను ఏస్ నెక్ట్స్ జెన్ భరిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో హైదరాబాద్లో 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్-9 ఫార్ములా ఈ-రేస్ జరిగింది. అనంతరం 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్-10 రేస్ కోసం ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో) సంస్థకు 2023 మేలోనే 50 శాతం సొమ్ము అంటే రూ.90 కోట్లు
చెల్లించాల్సి ఉండగా ఏస్ నెక్ట్స్జెన్ కంపెనీ ముందుకు రాలేదు.
అంతేగాక, సీజన్-9 ఫార్ములా ఈ-రేసు నిర్వాహణతో తమకు భారీగా నష్టం వాటిల్లిందంటూ ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ వైదొలిగింది. దీంతో ప్రమోటర్గా హెచ్ఎండీఏనే (హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ) పోషించాలని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
ఈ నేపథ్యంలో 2023 అక్టోబరు 5, 11 తేదీల్లో రూ.45.71 కోట్లను ఎఫ్ఈవోకు హెచ్ఎండీఏ నేరుగా బదిలీ చేసింది. ఈ వ్యవహారమే ఇప్పుడు ఈ ఏసీబీ విచారణకు కారణమైంది. రేస్ నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకొన్న ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీపై ఎలాంటి అప్పటి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపైనా ఏసీబీ సమగ్రంగా విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే ఆ కంపెనీని విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications