టీవీ9 కేసులో శివాజీ గరంగరం.. పోలీసులతో చంపించేయండి.. మైహోం రామేశ్వరరావుపై సంచలన వ్యాఖ్యలు..
హైదరాబాద్ : అలంద మీడియా కేసులో టీవీ 9, తెలంగాణ పోలీసుల తీరుపై సినీ నటుడు శివాజీ ఫైర్ అయ్యాడు. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేయడంపై ఆయన అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. దుబాయ్ వెళ్లిన ఆయనను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపించేశారంటూ మీడియాలో కథనాలు రావడంపై శివాజీ తీవ్రంగా స్పందించారు. దుబాయ్ అధికారులు తనను ఆపేందుకు తానేమైనా అంతర్జాతీయ ఉగ్రవాదినా అని ప్రశ్నించారు. హైదరాబాద్లోనే ఉన్న తనపై ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు మూల్యం చెల్లించుకోకతప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
పోలీసులతో చంపించేయండి
టీవీ 9 తమ యాజమానులను సంతోష పెట్టేందుకు తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని శివాజీ ఆరోపించారు. తనను పోలీసులతో చంపిచేస్తే అప్పుడు వారి పగతీరుతుందని, అలా చేస్తే మై హోం రామేశ్వర్ రావు, మెగా కృష్ణారెడ్డి, వారి అధినాయకుడు హ్యాపీగా ఫీలవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో ఉన్న తాను అమెరికాకు పారిపోతుంటే దుబాయ్ పోలీసులు వెనక్కి పంపారంటూ తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుంటే సీపీ సజ్జనార్ ఏం చేస్తున్నారని శివాజీ ప్రశ్నించారు.
రామేశ్వర రావు నుంచి ప్రాణహాని
గత ప్రభుత్వం తనకు ఇచ్చిన సెక్యూరిటీని ఏపీలో ప్రభుత్వం మారగానే తొలగించారని శివాజీ ఆరోపించారు. తనకు మై హోం రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి నుంచి ప్రాణహాని ఉందని అందుకే భద్రత కల్పించాలని సీఎం జగన్ను కోరానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అభ్యర్థనను పట్టించుకోకుండా ఇంకా వేధిస్తూనే ఉన్నారని, తాను రవి ప్రకాష్ షేర్లు కొంటే రామేశ్వర రావు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రశంసించారు. టీవీ 9లో వార్తలు రాయడం నేర్చుకోవాలని, కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెడితే అది సింహం అయిపోతదని అన్నారు. తనను వాళ్లు చంపేసినా తన శవం వాళ్లను చూసి నవ్వుతుందని శివాజీ ఘాటుగా వ్యాఖ్యానించారు.
తెలంగాణ పోలీసులు చేతగాని వాళ్లా?
టీవీ 9 ప్రసారం చేసిన కథనంపై శివాజీ స్పందించారు. తెలంగాణ పోలీసులు చేతగాని వాళ్లైనందునే దుబాయ్ పోలీసులు తనను పట్టుకున్నారని టీవీ 9 కథనం ప్రసారం చేసిందా? తెలంగాణ పోలీసుల అత్యుత్సాహం అమెరికాకు కూడా పాకిందా అని ప్రశ్నించారు. టీవీ9 ప్రసారం చేసిన క్లింప్పింగ్ కోర్టులో తనపై తప్పుడు కేసులు బనాయించారనడానికి సాక్ష్యంగా ఉపయోగపడుతుందని శివాజీ అభిప్రాయపడ్డారు. తనపైన ఉన్నది చాలా చిన్న కేసు అని దానిపై తనను విచారించవద్దని న్యాయస్థానం చెప్పినా రాజకీయ కక్ష సాధించేందుకు లూకౌట్ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు.
న్యాయస్థానంలోనే తేల్చుకుంటా
తనకు లుక్ ఔట్ నోటీసులు ఎందుకు ఇచ్చారో, పోలీసులు తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని శివాజీ డిమాండ్ చేశారు. ఎవరిని మెప్పించేందుకు ఇదంతా చేస్తున్నారన్న ప్రశ్నించారు. తెలంగాణలో నమోదవుతున్న కేసులన్నింటిపైనా లుక్ ఔట్ నోటీసుల జారీ చేస్తున్నారా అని ప్రశ్నించాడు. ఈ విషయంలో న్యాయస్థానంలోనే తాడోపేడో తేల్చుకుంటానని శివాజీ స్పష్టం చేశాడు. తాను ఇప్పటి వరకు 50సార్లు అమెరికా వెళ్లాలని లీగల్గా వెళ్లినందునే తనను ఎవరూ అడ్డుకోలేదని చెప్పారు. ప్రస్తుతం న్యాయస్థానం చెప్పినా తనను అమెరికాకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్న శివాజీ.. అవన్నీ తప్పుడు కేసులేనని అన్నారు. తనపై కక్ష సాధిస్తున్నవారిపై సమాజం తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.