Telangana: ప్రమాదంలో 23 జిల్లాలు.. ఇలాగే వదిలేస్తే ఢిల్లీ పరిస్థితే..!
ఢిల్లీలో ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి. అక్కడ గాలి కాలుష్యం పెరిగిపోతోంది. అయితే ఢిల్లీలోనే ఈ పరిస్థితి ఉందా అంటే.. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ విషయానికొస్తే ఇక్కడ కూడా పలు జిల్లాల్లో గాలి కాలుష్యం పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ తగ్గుతోంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రధాన ప్రాంతాల్లో గాలి కాలుష్యం పెరుగుతోంది. పట్టణ ప్రాంతాల్లో వాహనాలు, నిర్మాణాలు, పరిశ్రమలు పెరుగుతోన్నాయి. దీంతో ఆ ప్రాంతాల్లో గాలి నాణ్యత తగ్గుతోంది.
ఫలితంగా గాలిలో కాలుష్య కారకాలైన పార్టిక్యులేట్మ్యాటర్(పీఎం) 2.5 కు పెరిగుతోంది. తెలంగాణలోని 23 జిల్లాల్లో గాలి నాణ్యత సూచిక( AQI)వందకు పైగానే ఉంటుంది. వరంగల్, హనుమకొండలో హైదరాబాద్ కు మించి ఏక్యూఐ వస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వరంగల్ నగరంలో అత్యధికంగా ఏక్యూఐ 143 నమోదు అయింది. పీఎం 2.5 స్థాయిలో క్యూబిక్ మీటర్ గాలిలో 59 మైక్రోగ్రాముల మేర ఉన్నట్టు చెబుతున్నారు. ఏడాదిలో ఏక్యూఐ యవరేజ్ గా 120గా ఉంది. అయితే దాదాపు 180 రోజుల పాటు అదే స్థాయిలో లెక్కలు ఉండడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.

రాష్ట్రంలో హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ ఏక్యూఐ 110 కన్నా ఎక్కువగానే నమోదు అవుతుందని లెక్కలు చెబుతున్నాయి. భాగ్యనగరంలో ఏక్యూఐ 128 నమోదు అవుతుంది. హైదరాబాద్ లో అత్యధికంగా సనత్ నగర్ లో 125, రాజేంద్రనగర్ లో 124, మేడ్చల్లో 120, జీడిమెట్లలో 116, పటాన్చెరులో 114 మేర ఏక్యూఐ నమోదవుతుందని అధికారులు చెబుతున్నారు. గాలి కాలుష్యం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గాలి కాలుష్యం తగ్గించడమే లక్ష్యంగా టీజీఎస్ ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం 100 ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతున్నారు. డిసెంబర్ నాటికి సిటీలో మరో 500 బస్సులు తిప్పాలని భావిస్తున్నారు. జిల్లాల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చే యోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు వాడితే గాలి కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుంది.












Click it and Unblock the Notifications