Electric Two Wheeler: పేలిన ఎలక్ట్రిక్ టూ వీలర్.. వనపర్తిలో ఘటన..
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కొనాలంటేనే భయం అవుతుంది. ఎక్కడో ఓ చోట విద్యుత్ ద్విచక్ర వాహనాలు పేలుతూనే ఉన్నాయి. కొన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు పేలి మనుషులు కూడా చనిపోయారు. తాజాగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం పేలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడేలేదు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని వనపర్తి న్యూటౌన్ కాలనీలోని ఓ ఇంట్లో ఖాసీం, విష్ణు, రాములు రెంట్ కు ఉంటున్నారు. మంగళవారం రాత్రి విష్ణు స్నేహితుడు కిశోర్ వీరు రెంట్ కు ఉంటున్న ఇంటి ఆవరణలో తన ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జింగ్ చేశారు. ఛార్జింగ్ పూర్తయిన తర్వాత కిశోర్ పైకి వెళ్లి పడుకున్నాడు.
అర్ధరాత్రి ఛార్జింగ్ చేసిన విద్యుత్తు వాహనం (ఈవీ) బ్యాటరీ నుంచి మంటలు చెలరేగాయి.ఆ మంటలు పక్కనే ఉన్న మరో రెండు ద్విచక్ర వాహనాలు, ఒక సైకిల్ అంటుకుని అవి దగ్ధమయ్యాయి. దగ్గరలోనే ఉన్న విద్యుత్తు మీటర్లు, తలుపులు కూడా కొంత కాలిపోయాయి. ఇంటి పై అంతస్థులో నిద్రిస్తున్నవారు భయాందోళనకు గురయ్యారు. మెట్ల ద్వారా కిందికి దిగలేక తాళ్ల సాయంతో కిందికి దిగారు.
వెంటనే అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.ఈ ప్రమాదంలో రూ.3.40 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.