కెసిఆర్-మీరు కూర్చుంటేనే: బాబుతో ఉద్యోగులు, 'కబ్జా చేసుకోమన్న తలసాని'
హైదరాబాద్/విజయవాడ: తమను తెలంగాణ ప్రభుత్వం తొలగించిందని, తమకు మూడు నెలలుగా జీతాల లేవి, ఎవరూ పట్టించుకోవడం లేదని, మీ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని తమ సమస్యను పరిష్కరించాలని ఏపీ స్థానికత కలిగిన ఉద్యోగులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం నాడు వారు చంద్రబాబును కలిశారు. ఏపీ స్థానికత కలిగిన తెలంగాణ ఉద్యోగులను కొద్ది నెలల క్రితం తెలంగాణ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగులు శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు.
తెలంగాణ సర్కారు తమను తొలగించిందని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య తీరుతుందని చెప్పారు. తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని, మూడు నెలలుగా మాకు జీతాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు.

ఆ వార్తలను ఖండించిన లోకేష్
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి పదవిని చేపట్టబోతున్నారంటూ తన పైన వస్తున్న వార్తలను ఆ పార్టీ యువనేత, కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ ఖండించారు. ఇప్పటికిప్పుడే నాయకత్వ బాధ్యతల కోసం తాను తొందరపడటం లేదన్నారు. పార్టీ తనకు అప్పగించిన పనులను నిర్వహించడమే ఇప్పుడు తన ముందున్న కర్తవ్యమని చెప్పారు.
తలసాని భూకబ్జాను ఆపాలని కేసీఆర్కు లేఖ రాశా: మర్రి
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పైన మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం మండిపడ్డారు. హైదరాబాద్ సనత్నగర్లో ఉన్న జెక్ కాలనీలో వక్ఫ్ బోర్డుకు చెందిన భూమిని కబ్జా చేసుకోమని కొందరు కాలనీ వాసులకు తలసాని సూచించారని ఆరోపించారు.
మంత్రిగా ఉండి ఇలాంటి పనులకు పాల్పడటం దారుణమన్నారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ కూడా రాశానన్నారు. తలసాని చర్యలకు కేసీఆరే బాధ్యత వహించాలని, వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలన్నారు. తలసాని సూచనల మేరకు భూకబ్జా జరిగితే హిందూ, ముస్లింల మధ్య గొడవలు తలెత్తే అవకాశం ఉందన్నారు.












Click it and Unblock the Notifications