సెప్టెంబర్ 7నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. ముహూర్తం ఖారారు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి అధికారిక సర్కులర్ జారీ చేశారు. శాసన సభ, శాసన మండలి కార్యదర్శులు.. సభలో అడిగే ప్రశ్నలను పంపాలని సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన జీఓ 22 ఏ, పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు, కల్యాణ లక్ష్మి నిధుల మంజూరులో జాప్యం, సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లకు చెల్లింపులు, ఖరీఫ్ లో రైతుల యూరియా కష్టాలు, రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ప్రశ్నలు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు కార్యదర్శి సూచనలు చేశారు. 2వ తేదీలోగా వాటిని అందించాలని పేర్కొన్నారు. రూల్ 39 ప్రకారం సభ్యులు అడిగే ప్రశ్నలకు సభలో మంత్రులు సమాధానమివ్వాల్సి ఉంటుందని అన్నారు. ఈ మేరకు ముందస్తు ప్రశ్నలను సంబంధిత శాఖలకు పంపి తెలంగాణ ప్రభుత్వం సమాధానాలను సిద్ధం చేయనుంది. ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ ర్యాలీలో మాట్లాడుతూ.. యువత చట్ట సభలకు పోటీ చేసే వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ తీర్మానం చేసే అవకాశాలున్నాయని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి.

ఇక అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ కూడా హాజరు కావాలని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. మరి ఈ వర్షాకాల సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అని తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలు, రగులుతున్న సామాజిక అంశాల నేపథ్యంలో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే ఈ అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత కీలకంగా మారనున్నాయి.












Click it and Unblock the Notifications