మధుమేహం: ఏమార్చి ఎటిఎం కార్డులు మార్చేసి డబ్బులు కాజేశాడు
హైదరాబాద్: రద్దీగా ఉండి, సెక్యూరిటీ గార్డులు లేని ఎటిఎఁ కేంద్రాల వద్ద కాపు కాసి వినియోగదారులకు సహకరిస్తున్నట్లు నటించి నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని సికింద్రాబాదులోని మారేడుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. 2010 నుంచి అతను నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు అతను తొమ్మిది నేరాలు చేసినట్లు హైదరాబాద్ నార్త్ జోన్ డిసిపి ఎన్. ప్రకాష్ రెడ్డి మంగళవారం చెప్పారు.
మెదక్ జిల్లా సిద్ధిపేటకు చెందిన ఎ. రవీందర్ వెస్ట్ మారేడుపల్లిలో ఉంటున్నాడు. గతంలో చిన్నపాటి పనులు చేసుకునేవాడు. అయితే, అతను మధుమేహం బారిన పడ్డాడు. దీంతో పని చేయలేక తేలికగా సంపాదించడానికి నేరాలు చేయడానికి పూనుకున్నాడు.

అందుకు అతను రద్దీ ఉండి, సెక్యూరిటీ గార్డులు లేని ఎటిఎం కేంద్రాల వద్ద నిరీక్షిస్తుంటాడు. ఎటిఎం కార్డును ఎలా వాడాలో తెలియనివారు వచ్చే వరకు వేచి చూస్తాడు. అలాంటి వినియోగదారులను గుర్తించి సహాయం చేస్తున్నట్లు నమ్మిస్తాడు. వారు పిన్ నెంబర్ చెప్పగానే వారి కార్డుతో వారి పని పూర్తి చేసి, మాయ చేసి తన వద్ద ఉన్న కార్డును వారికి అంటగడుతాడు. తర్వాత దాన్ని వాడి డబ్బులు కాజేస్తాడు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన మారేడుపల్లి పోలీసులు సికింద్రాబాద్ జెబిఎస్ వద్ద ఉన్న, కరీంనగర్ జిల్లా సిరిసిల్లలోని ఎటిఎం కేంద్రాల నుంచి సిసి కెమెరా ఫుటేజీలను సేకరించి విశ్లేషించారు. దాంతో ఆ నేరాలకు ఒకే వ్యక్తి చేసినట్లు గుర్తించారు. అప్పటికే రవీందర్పై కరీంనగర్లో ఓ కేసు నమోదై ఉండడాన్ని కూడా తెలుసుకున్నారు.

మారేడుపల్లి పోలీసులు కరీంనగర్ పోలీసులను సంప్రదించారు. రవీందర్పై సస్పెక్ట్ షీట్ ఉందని, ప్రస్తుతం మారేడుపల్లిలో నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. దీంతో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి నగదును, ఎటిఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications