పైశాచిక దాడి, నగ్నంగా ఊరేగించిన ఘటన: బాధితురాలికి గర్భశోకం, నిందితులపై రౌడీషీట్
వరంగల్: తన భర్తను రెండో వివాహం చేసుకుందనే నెపంతో ఓ మహిళను రెండో భార్య, ఆమె బంధువులు దారుణంగా కొట్టి, ఇనుప చువ్వలతో కాల్చి.. నగ్నంగా ఊరేగించిన ఘటనలో బాధితురాలికి తీవ్ర అన్యాయం జరిగింది. గర్భవతి అయిన బాధితురాలు దాడిలో తీవ్రంగా గాయపడటంతో గర్భాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాడి ఘటనలో బాధితురాలు ఆంగోతు అనిత(24)కు గర్భశోకం మిగిలింది. మంగళవారం మధ్యాహ్నం ఆమెకు తీవ్రంగా కడుపు నొప్పి రావడంతో హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమె కడుపులోని పిండం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
వెంటనే ఆమెకు ఆపరేషన నిర్వహించి 20 వారాల పిండాన్ని తొలగించినట్లు ఆర్ఎంవో సుదార్ సింగ్ తెలిపారు. అనితను వర్ధన్నపేట మండలం డీసీ తండాకు చెందిన బానోతు రవి రెండో వివాహం చేసుకున్న నేపథ్యంలో మొదటి భార్య, ఆమె తరపు బంధువుులు గత సోమవారం ఆమెను వివస్త్రను చేసి, గ్రామంలో ఊరేగించి కర్రలు, ఇనుప చువ్వలతో ఆమెను కాల్చి చిత్రహింసలకు గురిచేశారు.
కాగా, ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అనితను కలెక్టర్ వాకాటి కరుణ, పోలీస్ కమిషనర్ సుధీర్బాబు పరామర్శించారు. బాధితురాలి తల్లిదండ్రులను పిలిచి విచారణ జరిపారు. అనితకు, ఆమె కుటుంబసభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాగా, సీపీ సుధీర్ బాబు డీసీ తండాకు చేరుకుని సమీక్షించారు.
నిరక్షరాస్యత, అజ్ఞానం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని, తండాను తాము దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. గ్రామంలో వెంటనే గ్రంథాలయం ఏర్పాటు చేయించారు. గర్భిణి అని కూడా చూడకుండా కర్రలతో కాలుస్తూ తిప్పడం, చూస్తూ ఊరుకోవడంపై తండావాసులను మందలించారు.
ఈ ఘటనలో ప్రధాన నిందితులు మహేశ, విజయ్లను మంగళవారం అరెస్ట్ చేశారు. వారిపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు తెలిపారు. పరిస్థితులు చక్కబడే వరకూ గ్రామంలో ముగ్గురు పోలీసులతో పికెట్ ఏర్పాటు చేశారు.