ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై రేవంత్ హాట్ కామెంట్స్: ఎవ్వర్నీ వదలను: సీఎంగా విఫలమైనట్టే
HYDRA: ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరు.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. సింపుల్గా చెప్పాలంటే హైడ్రా. అక్రమార్కుల గుండెల్లో రైళ్లను పరుగెత్తిస్తోంది వ్యవస్థ. చెరువులు, కుంటలను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్మెంట్లను సైతం నేలమట్టం చేస్తోంది.
మరింత బలం..
హైదరాబాద్, సికింద్రాబాద్లల్లో ఆక్రమణకు గురైన చెరువులను పరిరక్షించడం, వాటిల్లో వెలిసిన అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి ప్రత్యేకంగా హైడ్రా వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అదనంగా మూడువేల మంది సిబ్బందినీ దీనికి కేటాయించింది.

చెరువులకు విముక్తి..
మీరాలం, బమ్ రుక్ ఉద్ దౌలా వంటి చెరువులు, వాటి ఎఫ్టీఎల్ పరిధి, బఫర్ జోన్ అధిగమించి నిర్మించిన పలు భవనాలు, అపార్ట్మెంట్లను ఇప్పటికే కూల్చివేశారు అధికారులు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్- కన్వెన్షన్ సెంటర్ పాక్షిక కూల్చివేతతో హైడ్రా పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
ఎన్ కన్వెన్షన్..
మాదాపూర్ తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు నిర్ధారణ కావడంతో హైడ్రా, జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు ఆక్రమణలను తొలగించారు. దీనిపై నాగార్జున కోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. కూల్చివేతలకు స్టే లభించింది.
రేవంత్ తొలిసారి..
హైడ్రా చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతలపై రేవంత్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని పునరుద్ఘాటించారు. ఎంతమంది ఎన్నిరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చినా పట్టించుకోబోనని స్పష్టం చేశారు. తన మిత్రులకు ఫామ్హౌస్లు ఉన్నా వదలమని తేల్చి చెప్పారు.
గీతాబోధన..
అక్రమణదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తామని కుండబద్దలు కొట్టారు. అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో తనకు భగవద్గీతే స్ఫూర్తి అని చెప్పారు రేవంత్ రెడ్డి. శ్రీకృష్ణుడి గీతాబోధన అనుసారమే ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలను చేపట్టామని పేర్కొన్నారు.
కక్ష సాధింపు కాదు..
చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్లు కట్టుకున్నారని, డ్రైనేజీ నీటిని చెరువుల్లో కలుపుతున్నారంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాల కోసమో, నాయకులపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానో అక్రమ కట్టడాలను కూల్చివేయట్లేదని వ్యాఖ్యానించారు. అక్రమ నిర్మాణాలు అలాగే వదిలేస్తే తాను ప్రజా ప్రతినిధిగా విఫలం అయినట్లే అన్నారు.
ఎలాంటి వారైనా..
చెరువులను ఆక్రమించినవారిలో కొందరు ప్రభుత్వాలను ప్రభావితం చేయొచ్చని, ప్రత్యక్షంగానో ప్రభుత్వంలో భాగస్వామ్యులైన వారు కూడా ఉండొచ్చని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మరికొందరు సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండొచ్చని, వారెవరిని పట్టించుకోబోనని తేల్చి చెప్పారు. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతానని అన్నారు.












Click it and Unblock the Notifications