ఆగస్టు నుంచి కొత్త పెన్షన్ విధానం! ప్రతి ఒక్కరికీ..
ప్రతి నెలా పింఛన్ డబ్బుల కోసం ఎదురుచూసే అవ్వాతాతలకు, చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బంది పడే పేదలకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయంతో ఊరటనివ్వనుంది. 'చేయూత' పథకంలో అవినీతికి అడ్డుకట్ట వేస్తూ.. లబ్ధిదారులందరికీ ఇకపై నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ సొమ్మును జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు ఇలా దాదాపు 42 లక్షల మంది 'చేయూత' పింఛన్లపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో సగం మందికి మాత్రమే ఆన్లైన్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. వృద్ధులు, దివ్యాంగులకు పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు నగదు రూపంలో ఇస్తుండగా.. మిగిలిన వారికి పోస్టల్ అకౌంట్ల ద్వారా చెల్లిస్తున్నారు. అయితే, ఈ నగదు పంపిణీలో అక్కడక్కడా అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. దీనికి తోడు పోస్టాఫీసుల దగ్గర వృద్ధులు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడి నరకం చూస్తున్నారు. ఈ ఇబ్బందులన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం డిజిటల్ పేమెంట్లకు శ్రీకారం చుట్టింది.

ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాంక్ అకౌంట్..
నగదు రూపంలో పింఛన్ తీసుకుంటున్న వారి ఇబ్బందులను గమనించిన రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్).. వారికి కొత్తగా 'పోస్టల్ బ్యాంక్ ఖాతాలు' తెరిపించే పనిలో పడింది. దీనివల్ల లబ్ధిదారులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారి ఖాతాలోనే డబ్బులు పడతాయి. అవసరమైనప్పుడు నేరుగా బ్యాంకుకు వెళ్లిగానీ, లేదా దగ్గర్లోని ఏటీఎంల ద్వారా గానీ ఎంచక్కా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు.
ఆగస్టు నుంచే కొత్త విధానం?
ప్రస్తుతం పింఛన్దారుల లబ్ధిని నిర్ధారించేందుకు 'లైవ్ అథెంటికేషన్' ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జూన్ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే.. జూలై ప్రక్రియ పూర్తి చేసుకుని, ఆగస్టు నెల నుంచి లబ్ధిదారులందరి ఖాతాల్లోకి నేరుగా పింఛన్ డబ్బులు జమ కానున్నాయి. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంతో అక్రమాలకు బ్రేక్ పడటమే కాకుండా, లబ్ధిదారులకు కాలయాపన తప్పుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications