తెలంగాణ లోక్సభ కోసం బీజేపీ గేమ్ స్టార్ట్: కొత్త నేతను దింపిన హైకమాండ్
Lok Sabha elections 2024: లోక్సభ ఎన్నికల గడువు సమీపించింది. ఇంకో రెండు నెలల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.
తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఈ సారి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. 17 లోక్సభ నియోజకవర్గాలకూ రాజకీయ ఇన్ఛార్జీలను ప్రకటించింది. శాసన సభ, శాసన మండలి సభ్యులకు ఈ బాధ్యతలను అప్పగించింది. లోక్సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీ స్థితిగతులపై అధ్యయనం చేయడం, సమర్థుడైన అభ్యర్థి పేరును వాళ్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది.
మొన్నటి ఎన్నికల్లో ఓటమి చవి చూసిన బీజేపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు లోక్సభ బరిలో నిల్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి- తనకు అచ్చి వచ్చిన సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి మరోసారి ఎన్నికల్లో పోటీ చేయబోతోన్నారు. ప్రస్తుతం ఆయన ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు.
ఈ పరిస్థితుల్లో ఓ కొత్త నాయకుడిని రంగంలోకి దించిన బీజేపీ జాతీయ నాయకత్వం. రాజస్థాన్కు చెందిన సీనియర్ నేత చంద్రశేఖర్ను తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. గత ఏడాది రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం వెనుక చంద్రశేఖర్ కీలక పాత్రను పోషించారు.
అభ్యర్థుల ఎంపిక మొదలుకుని, ప్రచార కార్యక్రమాల వరకూ అన్నింటినీ చంద్రశేఖరే పర్యవేక్షించారు. వ్యూహాత్మంగా వ్యవహరించగలిగారు. అందుకే ఆయనను తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక స్థానాలను గెలిపించే బాధ్యతను ఇచ్చింది బీజేపీ హైకమాండ్. తెలంగాణలో రాజస్థానీయుల ఓటుబ్యాంక్ అధిక సంఖ్యలో ఉండటం కూడా- ఆయన నియామకానికి ఓ కారణమైంది.
చంద్రశేఖర్ను పార్టీ తెలంగాణ రాష్ట్రశాఖ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్)గా నియమిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటన జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.












Click it and Unblock the Notifications