'వరంగల్'పై బీజేపీతో కసరత్తు: బాబుతో భేటీ, గ్రేటర్లో సెటిలర్స్పై కన్ను
హైదరాబాద్: వరంగల్ లోకసభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్న దానిపై తెలంగాణ టీడీపీ, బీజేపీ నేతలు అంతర్గత చర్చలు జరుపుతున్నారు. పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని టీడీపీ బీజేపీకి వదిలేసింది. ఉప ఎన్నికల్లో సైతం అలాగే ఇవ్వాలనే ప్రతిపాదన బీజేపీ నుంచి వచ్చిందని సమాచారం.
అయితే, ప్రస్తుతం వరంగల్ లోకసభ నియోజకవర్గంలో ప్రజల నాడిని అంచనా వేసేందుకు తెలంగాణ టీడీపీ నాయకులు చూస్తోంది. ఏ పార్టీ పోటీ చేస్తే ఎక్కువ లాభమనే విషయాన్ని అంతర్గత సర్వే ద్వారా తెలుసుకోవాలని నేతలు భావిస్తున్నారు.
వరంగల్తో పాటు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇరుపార్టీల నేతలు త్వరలో భేటీ కానున్నారు. ఆదివారం నాడు తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నర్సింహులు, ఎల్ రమణ తదితరులు దత్తాత్రేయలను కలిసి ఈ విషయమై చర్చించారు.

చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ నేతలు భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ తదితరులు సోమవారం ఉదయం భేటీ అయ్యారు. వరంగల్ ఉప ఎన్నిక పైన బండారు దతాత్త్రేయ, ఇతర బీజేపీ నేతలతో జరిగిన చర్చల సారాంశాన్ని వారు బాబుకు తెలిపారు.
సెటిలర్స్ పైన అందరి కన్ను
సెటిలర్స్ అనే పదం ఉపయోగించవద్దని ఒకవైపు డిమాండ్ వినిపిస్తుండగా, మరోవైపు సెటిలర్ల అంశంపై ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఆసక్తికరమైన రాజకీయం సాగుతోంది. హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిని కేంద్రంగా చేసుకొని వివిధ రాజకీయ పార్టీలు వాళ్లు మావాళ్లంటే.. కాదు మా వాళ్లంటూ వాదిస్తున్నారు.
హైదరాబాదులో టీడీపీ, బీజేపీలకు ఎక్కువ పట్టు ఉంది. సాధారణ ఎన్నికల్లో సైతం హైదరాబాదులో ఈ పార్టీలకు అండగా నిలిచారు. రాష్టవ్య్రాప్తంగా జరిగిన ఎన్నికలు కావడం వల్ల మిగిలిన రాజకీయ పక్షాలు ఈ వర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించలేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ఈ వర్గంపై దృష్టిసారించాయి.
కాంగ్రెస్ వల్లనే హైదరాబాద్లో సెటిలర్స్కు భద్రత ఉంటుందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ప్రచారాన్ని ప్రారంభించారు.
మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తాం, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో హైదరాబాద్లోని ఈ వర్గానికి భరోసా ఇచ్చే ప్రయత్నించారు. అయితే టీడీపీ, బీజేపీ కూటమి మాత్రం ఎవరెన్ని ప్రచారాలు చేసినా, ఎవరెన్ని హామీలు ఇచ్చినా ఈ వర్గం ఓట్లు తమకే లభిస్తాయని ధీమాతో ఉంది.












Click it and Unblock the Notifications