బీఆర్ఎస్ లిస్ట్లో ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు: మహిళలు ఎంతమంది?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో.. అధికార భారత్ రాష్ట్ర సమితి సమర శంఖాన్ని పూరించింది. అన్ని పార్టీల కంటే ముందుగా.. అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 111 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు.
కేసీఆర్.. రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. తన కంచుకోట గజ్వేల్తో పాటు కొత్తగా కామారెడ్డిని ఎంచుకున్నారాయన. కేసీఆర్ తనయుడు, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ఎప్పట్లాగే సిరిసిల్ల నుంచి పోటీ చేయనున్నారు. సిద్ధిపేట్ నుంచి మంత్రి హరీష్ రావు రేసులో నిలిచారు.

ఈ జాబితాలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు లభించాయి? ఎంతమంది మహిళ అభ్యర్థులకు కేసీఆర్ చోటు కల్పించారనేది చర్చనీయాంశమైంది. సామాజిక వర్గాలవారీగా చూసుకుంటే రెడ్డి కులానికి ప్రాధాన్యత ఇచ్చారనేది స్పష్టమౌతోంది. బలమైన సామాజిక వర్గం కావడం వల్ల రెడ్డి అభ్యర్థులకే అగ్రస్థానం లభించింది ఈ జాబితాలో.
మొత్తంగా 39 మంది రెడ్డి అభ్యర్థులకు టికెట్లు లభించాయి. రెండో స్థానం వెనుక బడిన సామాజిక వర్గాలకు లభించింది. 23 మంది బీసీ అభ్యర్థులను ఎన్నికల బరిలో దింపారు కేసీఆర్. 19 మంది షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులకు తొలి జాబితాలో స్థానం దక్కింది. షెడ్యూల్డ్ తెగల వారికి 11 సీట్లను కేటాయించారు.

తన సొంత సామాజిక వర్గం వెలమ కులస్తులకు 12 సీట్లను కేటాయించారు కేసీఆర్. స్వయంగా కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తోన్నారు. ఆయన కాకుండా 10 మంది వెలమ సామాజిక వర్గ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఆరు మంది కమ్మ అభ్యర్థులు, ముగ్గురు మైనారిటీలు ఈ జాబితాలో ఉన్నారు. వైశ్య, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు ఒక్కో స్థానం దక్కింది.
ఇక మొత్తం అభ్యర్థుల జాబితాలో ఏడుమంది మహిళలు ఉన్నారు. సబితా ఇంద్రారెడ్డి- మహేశ్వరం, పద్మా దేవేందర్రెడ్డి- మెదక్, బానోత్ హరిప్రియ నాయక్- ఎల్లందు, గొంగిడి సునీత- ఆలేరు, కోవ లక్ష్మి- ఆసిఫాబాద్, జీ లాస్య నందిత- సికింద్రాబాద్ కంటోన్మెంట్, బడే నాగజ్యోతి- ములుగు టికెట్లు కేటాయించారు.












Click it and Unblock the Notifications