బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి అరెస్ట్
బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. సోమవారం హైదరాబాద్ లో అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టిన నిరసన ప్రదర్శనల సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ జీ ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అరెస్ట్ అయ్యారు. కొద్దిసేపటి కిందటే పోలీసులు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో వారిని అదుపులోకి తీసుకున్నారు. నారాయణ గూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నేడు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.
అసెంబ్లీ స్పీకర్ ఓఎస్డీ పోలేపల్లి వెంకటేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిద్దరిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బీఎన్ఎస్ సెక్షన్ 352, 3(5), ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్లు 3(1)(ఆర్), 3(2)(వీఏ), 3(2)(7) కింద కేసు నమోదు చేశారు. దీనికి అనుగుణంగా కొద్దిసేపటి కిందటే వారిని అదుపులోకి తీసుకున్నారు.
తాతా మధు అరెస్ట్ సమాచారం తెలుసుకున్న వెంటనే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్వార్టర్స్ కు చేరుకున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ తాతా మధు పార్టీ నాయకులను ఉద్దేశించి చెప్పడం కనిపించింది.

స్పీకర్ ను ఉద్దేశించి ఏకవచనంతో సంబోధించడం, కఠినపదజాలాన్ని ప్రయోగించడమే ఆయన అరెస్ట్ కు దారి తీసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ కన్నీరు సైతం పెట్టుకున్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అమర్యాదకరంగా మాట్లాడటాన్ని తప్పుట్టారు. శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలనీ మంత్రులు పట్టుబట్టారు.
స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఓ ఎమ్మెల్సీ కఠినపదజాలంతో మాట్లాడటం చట్టసభలకు గౌరవం కాదనీ స్వయంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ ఆయనను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపైనా ఉందని, వారిపై ఇంకా వివక్షాపూరకంగా మాట్లాడటం, అవమానించడం సరైంది కాదని రేవంత్ చెప్పారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామనీ సభకు హామీ ఇచ్చారు.
#WATCH | Hyderabad, Telangana | Saifabad Police reached the residence of BRS MLC T Madhusudhan Rao, alias Tata Madhu, in connection with a complaint filed by Pollepalli Venkatesham, Officer on Special Duty (OSD), against BRS MLCs Madhu and N Naveen Kumar Reddy for allegedly… https://t.co/8a12tedtYj pic.twitter.com/trghHA7IOn
— ANI (@ANI) September 8, 2026
రేవంత్.. ఈ హామీ ఇచ్చిన మరుసటి రోజే తాతా మధు అరెస్ట్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ తో పాటు బీఎన్ఎస్ లోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. అలాగే.. అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, హరీశ్రావు, సుధీర్రెడ్డి, సబిత ఇంద్రారెడ్డిపైనా కేసులు నమోదు చేశారు పోలీసులు. వీడియో ఫుటేజీ ఆధారంగా సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో వారిపై ఈ కేసులు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications
