ఢీకొట్టడంతో కారుపై పడిన యువకుడు: రక్తమోడుతున్నా 6కి.మీ..
మహబూబ్నగర్: ఇటీవల మానవత్వాన్ని మంట గలుపుతున్న ఘటనలు చాలానే చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో సోమవారం రాత్రి జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారుతో ఢీకొట్టడంతోపాటు.. కారుపై పడిన అతని మృతదేహంతోనే 6కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు కొందరు దుర్మార్గులు.
ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన శ్రీనివాసులు(35) సోమవారం రాత్రి 9 గంటల సమయంలో 44వ నంబరు జాతీయ రహదారిపై జడ్చర్ల కొత్తబస్టాండు సమీప ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డు దాటుతున్నాడు.
అదే సమయంలోనే హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు(ఏపీ28సీకే 8477) అతన్ని వేగంగా ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసులు ఎగిరి కారుపై పడ్డాడు. అయితే, ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారును ఆపకుండా కారులోని వారు.. అలాగే అక్కడ్నుంచి కారుతో వెళ్లిపోయారు.
కారుపై ఉన్న వ్యక్తి శరీరంనుంచి రక్తం కారుతున్నా పట్టించుకోకుండా 6కిలోమీటర్ల దూరం ప్రయాణం కొనసాగించారు. స్థానికులు, పోలీసులు వెంబడించడంతో మాచారం సమీపంలో కారు వదిలి పారిపోయారు.
దీంతో పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే శ్రీనివాసులు మృతి చెందినట్టు గుర్తించి.. మృతదేహాన్ని బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. కారు వివరాలు ఆరా తీస్తున్నట్లు జడ్చర్ల ఎస్సై మధుసూదన్గౌడ్ తెలిపారు. నిందితులను పట్టుకుని చర్యలు తీసుకుంటామని చెప్పారు.