కేసీఆర్పై నమ్మకం ఉంది: డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదన్న కొత్తపల్లి గీత
హైదరాబాద్: తన భర్త రామకోటేశ్వరరావు కిడ్నాప్ వ్వవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నట్లు అరకు ఎంపీ కొత్తపల్లి గీత అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాసరావు అరగంట సేపు మీడియా సమావేశం పెడితే అబద్ధం నిజం కాదన్నారు.
తన భర్తను సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిర్బంధించిన మాట వాస్తమని, ఈ విషయంలో డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని కొత్తపల్లి గీత అన్నారు. భూ వ్యవహారంపై హోటల్ తాజ్ కృష్ణాలో చర్చలు జరుగుతున్న సమయంలో తన భర్తకు ఫోన్ చేశానని చెప్పుకొచ్చారు.
దాదాపు రెండు గంటల పాటు ఆయన మొబైల్ స్పందించలేదని ఆమె తెలిపారు. తమ ఫోన్లు లాక్కొని నిర్బంధించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె ప్రశ్నించారు. వెంటనే, తన భర్త కారు డ్రైవర్కు ఫోన్ చేశానని, అక్కడున్న కొందరు వ్యక్తులు తన భర్తను నిర్భంధించారని తనకు చెప్పాడని అన్నారు.
ఈ నేపథ్యంలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బుధవారం అర్ధరాత్రి తన భర్తను కిడ్నాపర్లు కొండాపూర్ లో వదిలేసిన తర్వాత ఆయన తనకు ఫోన్ చేశారని తెలిపారు. తన భర్త కిడ్నాప్ వెనుక బిల్డర్ రామకృష్ణ, సుధాకర్తో పాటు మంత్రి తలసాని కొడుకు సాయి యాదవ్ పాత్ర ఉందని గీత ఆరోపించారు.
ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్తో 2013 నుంచి సంబంధాలున్నాయని ఆమె చెప్పారు. ఈ భూ వ్యవహారంలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత తన భర్తను మంత్రి తలసాని కుమారుడు సాయి యాదవ్ కిడ్నాప్ చేశారంటూ బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు ఎంపీ కొత్తపల్లి గీత భర్త రామకోటేశ్వరరావు బెదిరింపుల వ్యవహారంలో మంత్రి తలసాని యాదవ్ కుమారుడు సాయి యాదవ్పై కేసు నమోదైంది. రాయదుర్గంలోని తన ఐదెకరాల భూ వివాదంలో జోక్యం చేసుకుని, తనను బెదిరించాడంటూ ఆమె భర్త రామకోటేశ్వరరావు గురువారం ఉదయం పంజాగుట్ట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.