స్టీఫెన్సన్ వాంగ్మూలం లీక్: చంద్రబాబుపై ఏం చెప్పారు?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ హైదరాబాదులోని నాంపల్లి కోర్టులు ఇచ్చిన వాంగ్మూలం లీక్ అయింది. వివిధ తెలుగు టీవీ చానెళ్లు ఆ వాంగ్మూలం వివరాలను వెల్లడించాయి. ఓటుకు నోటు కేసులో రెండు రోజుల క్రితం స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నాంపల్లి కోర్టు నమోదు చేసిన విషయం విదితమే.
కోర్టులో వాంగ్మూలం నమోదు తర్వాత స్టీఫెన్సన్ శనివారం ఓటుకు నోటు వ్యవహారంపై ఏసీబీకి వాంగ్మూలం ఇచ్చారు. టీవీ చానెళ్లలో వచ్చిన వివరాల ప్రకారం - మే 28న జెరూసలేం మత్తయ్య తనకు ఫోన్ చేశారని, మే 30న బషీర్బాగ్లో జరిగే ఓ కార్యక్రమానికి ఆహ్వానించారని, అదే రోజు ఉదయం 10 గంటలకు మత్తయ్య తన ఇంటికి వచ్చి తనను ఎమ్మెల్యే రేవంత్రెడ్డి పంపినట్లు చెప్పారని, ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని రూ. 2 కోట్లు ఆఫర్ చేశారని స్టీఫెన్ సన్ చెప్పారు.
ఇంకా ఆయన ఈ విధంగా చెప్పినట్లు టీవీ చానెళ్లలో వార్తాకథనాలు వచ్చాయి - "విదేశాలకు వెళ్లేందుకు టిక్కెట్ కూడా ఇస్తామన్నారు. గంటన్నర తర్వాత ఆంటోనీ అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి సెబాస్టియన్ను పరిచయం చేశారు. చంద్రబాబు పంపితే వచ్చినట్లు సెబాస్టియన్ చెప్పారు" స్టీఫెన్సన్ తన వాంగ్మూలంలో చెప్పారు.
"టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేస్తే రూ. 5 కోట్లు ఇస్తామన్నారు. ఏ విషయమైంది తర్వాత చెప్తానన్నారు. వెంటనే ఈ విషయాన్ని డీజీపీకి, ఏసీబీకి లేఖ ద్వారా తెలియజేశాను. ఇదే లేఖను ఏసీబీ డీఎస్పీకి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందజేశాను" అని చెప్పారు.
"నా ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు మా ఇంట్లో టీవీ స్టాండ్ దగ్గర ఆడియో, వీడియో రికార్డింగ్ సౌకర్యం ఉన్న ఐఫోన్ను అమర్చారు. ఈ డీల్లో ముఖ్యనేతలు టచ్లోకి వస్తేనే మాట్లాడతానని చెప్పా. దీంతో రేవంత్రెడ్డి టచ్లోకి వచ్చారు. చంద్రబాబుతో మాట్లాడిస్తానని నాతో సెబాస్టియన్ చెప్పారు" అని అన్నారు.
"చంద్రబాబు మీటింగ్లలో ఉండటంతో మాట్లాడేందుకు కుదరలేదు. ఆరోజు సాయంత్రం సెబాస్టియన్ నాకు ఫోన్ చేశారు. చంద్రబాబు మాట్లాడుతారంటూ ఫోన్ ఆయనకు ఇచ్చారు. మా వాళ్లు నాకు బ్రీఫ్ చేశారు మీరు ఫ్రీగా నిర్ణయం తీసుకోండి మీకు అండగా నేను ఉంటానని చంద్రబాబు అన్నారు" అని స్టీఫెన్ సన్ చెప్పినట్లుగా టీవీ చానెళ్లు వార్తాకథనాలను ప్రసారం చేశాయి.