గవర్నర్, తలసానిని తొలగించండి: కేంద్రానికి మర్రి శశిధర్ లేఖ
హైదరాబాద్: తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ కేబినెట్లో మంత్రిగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని మర్రి శశిధర్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఈ మేరకు బాధ్యులైన గవర్నర్ నరసింహన్ను తప్పించాలంటూ మూడు రోజుల క్రితమే కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు.
మంత్రి తలసానిని గవర్నర్ బర్తరఫ్ చేయకపోవడం విధులను సరిగా నిర్వహించకపోవడమేనని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు నరసింహన్ ను గవర్నర్ పదవి నుంచి తప్పించాలని కేంద్రాన్ని కోరారు.
తెలుగుదేశం ఎమ్మెల్యే తలసాని టిఆర్ఎస్ ప్రభుత్వ కేబినెట్లో మంత్రిగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని.. విధుల్లో విఫలమైన గవర్నర్ను తప్పించాలని పేర్కొన్నారు. తలసాని విషయంలో మొదట తెలంగాణ ప్రభుత్వానిదే తప్పు అనుకున్నా.. కీలక పాత్ర గవర్నర్దేనని అన్నారు.
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే విధంగా గవర్నర్ వ్యవహార శైలి ఉందని ఆరోపించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్ 10ని గవర్నర్ ఉల్లంఘించారని అన్నారు. గవర్నర్ను తొలగించాలని రాష్ట్రపతిని కూడా కోరతానని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. తలసానిని కూడా వెంటనే తొలగించాలని శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.